లోన్ తీసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద తతంగం. లోన్కి సెక్యురిటీగా ఏదో ఒక అస్థి చూపించాలి.. అంతేనా, లోన్ తిరిగి కట్టడానికి మనకున్న సోర్స్ ఏమిటన్నది వాళ్లకి చూపాలి. ఇవన్నీ చూపిన తర్వాతగానీ, లోన్ మంజూరు చేయవు బ్యాంకులు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు ఎంతో మారాయి. అంతా డిజిటల్ మయం. యాప్స్ ద్వారా నిమిషాల్లో లోన్స్ తీసుకోవచ్చు. కానీ ఏమాత్రం కట్టడం ఒక్కరోజు ఆలస్యమైనా నిమిషానికొకసారి ఫోన్ చేసి ప్రాణాలు తోడేస్తారు. మీకే కాదు మీకు సంబంధించిన వారందరికి మీ గురించి సందేశాలు పంపి మీ పరువు తీస్తారు. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో కలకలం రేపాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే దాదాపు ముగ్గరు ఆన్ లైన్ లోన్స్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
అరెస్టుల పర్వం
ఈ సంఘటనలతో అప్రమత్తమైన పోలీస్ శాఖ దాడులు నిర్వహించడం ప్రారంభించింది. అందులో విస్తుపోయే నిజాలు వెలుగుచూసాయి. ఇలాంటి ఆన్ లైన్ యాప్స్ దాదాపు చైనాకు సంబంధించినవి కావడం గమనార్హం. యాప్స్ని చైనా కేంద్రంగా నిర్వహిస్తూ.. స్థానికంగా కాల్ సెంటర్స్ ద్వారా ప్రజలను పీడిస్తున్నారు. అలాంటి కొన్ని సంస్థల గుట్టు రట్టు చేసారు పోలీసులు. తాజాగా హైదరాబాద్ వాసి ఇచ్చిన ఫిర్యాదుతో పుణె కేంద్రంగా నిర్వహిస్తున్న ఆన్ లైన్ లోన్స్ కాల్ సెంటర్పై రైడ్ నిర్వహించి.. ఒక చైనా మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత స్పందించిన పోలీసులు.. ప్రజలు ఇలాగే సమస్యలు ఎదురైనపుడు పోలీసులను ఆశ్రయించాలి కానీ.. ఆత్మహత్యలు చేసుకోకూడదని హితవు పలికారు.
వీటిని బ్లాక్ చేయండి..
దాడులు.. అరెస్టులతోపాటు.. ఆన్ లైన్ యాప్స్ పైన కూడా దృష్టి సారించారు పోలీసులు. అధిక వడ్డీలకు ఇన్స్టాంట్గా లోనులు అందిస్తూ.. ఆపై ప్రజలను బెదిరిస్తున్న యాప్స్ని గుర్తించారు పోలీసులు. ఆర్బిఐ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 158 యాప్స్ని గుర్తించి ఒక లిస్ట్ ని తయారుచేశారు పోలీసులు. వాటిని గూగుల్కి అందించి ప్లేస్టోర్ నుంచి తొలగించాల్సిందిగా గూగుల్కు విన్నవించారు. బాధితులకు వస్తున్న ఫోన్ నంబర్లను గమనించిన పోలీసులు వాటిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కానీ అవి అందుబాటులో లేనట్టుగా రావడంతో, ఫోన్ చేస్తున్న వారు ‘వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్’ని ఉపయోగిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి యాప్స్ ద్వారా లోన్స్ తీసుకోవడం లాంటి పనులు చేయద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Must Read ;- ఆత్మహత్యలకు దారితీస్తున్న ఆన్లైన్ అప్పులు