నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు రెండు నెలలుపైగా చేస్తున్న ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారుతోంది. రిపబ్లిక్ డే నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో తీవ్ర హింస చెలరేగిన సంగతి తెలసిందే. ఆ తరవాత రైతులను ఢిల్లీ సరిహద్దుల నుంచి ఖాళీ చేయించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ కార్యకర్తలను రైతులపైకి రెచ్చగొడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సింఘు సరిహద్దులో రైతులపై, స్థానికులు తిరుగుబాటు చేశారు. రైతులు గుడారాలు వేయడం వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నా యంటూ రైతులపై దాడికి దిగారు. దీంతో పోలీసులు రైతులు వేసిన గుడారాలు పీకే ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుడారాలు పీకుతున్న పోలీసులను రైతులు అడ్డుకోవడంతో వారు లాఠీ ఛార్జ్ చేశారు. భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. దీంతో సింఘు సరిహద్దు ఉద్రిక్తంగా మారింది.
కావాలనే చేస్తున్నారా?
గత రెండు నెలల నుంచి నిరసన చేస్తున్న రైతులకు సహకరించిన ఢిల్లీ సరిహద్దు గ్రామాల రైతులు, స్థానికులు ఒక్కసారిగా రైతులపై తిరుగుబాటు వెనుక ఆర్ ఎస్ ఎస్ హస్తం ఉందనే అనుమానాలను రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. రైతులపై దాడికి దిగిన వారు కూడా స్థానికులు కాదని, ఎక్కడ నుంచో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలను తీసుకువచ్చి రైతులపైకి తోలుతున్నారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సింఘు సరిహద్దులో రైతుల గుడారాలు ఖాళీ చేయించాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చట్టాలు రద్దు చేసే వరకు ఢిల్లీ వదిలేది లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు మిన్నకుండిపోయారు.
Must Read ;- ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు