దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో.. దిక్కుతోచని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా ప్రభుత్వం.. కఠిన చర్యలకు దిగుతోంది. మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్న ఐదు జిల్లాల్లో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్ జిల్లాల్లో వారం రోజులు లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సోమవారం రాత్రి ప్రారంభమై మార్చి 1వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
లాక్డౌన్
రాష్ట్రంలో సభలు, సమావేశాలను ప్రభుత్వం రద్దు చేసింది. తొలుత అమరావతి జిల్లాలో శనివారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అధికారులు లాక్డౌన్ అమలు చేశారు. తాజాగా మరో వారం పొడిగించారు. కాగా, కీలక నగరం పుణెతో పాటు నాసిక్లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. వచ్చే శుక్రవారం సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి. విద్యా సంస్థలను నెలాఖరు వరకు మూసివేయనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు.15 రోజుల్లోనే కేసులు 2,500 నుంచి 7 వేలకు చేరినట్లు తెలిపారు. మరో 8 నుం చి 15 రోజులు పరిస్థితిని సమీక్షిస్తామని, అప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటే.. రాష్ట్రమంతటా లాక్డౌన్ విధించే విషయం పరిశీలిస్తామని చెప్పారు. కేసులు అనూహ్యంగా పెరగడానికి సెకండ్ వేవ్ కారణమా? కాదా? అనేది రెండువారాల అనంతరం తెలుస్తుందన్నారు. లాక్డౌన్ వద్దనుకుంటే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పెరుగుతున్న కేసులు
మహారాష్ట్రలో ఆదివారం 6,971 మందికి వైరస్ సోకింది. వరుసగా మూడో రోజు కేసులు ఆరువేలు దాటడం గమనార్హం. ఎక్కువ శాతం కేసులు గ్రామీణ ప్రాంతాలు, ముంబైలోని నాన్-స్లమ్ ప్రాంతాల నుంచే నమోదవుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మరోవైపు పుణెలో మూడు నెలల నుంచి అదుపులో ఉన్న కరోనా కొన్ని రోజులుగా విజృంభిస్తోంది. పుణె డివిజన్లో శనివారం వెయ్యి మందికి వైరస్ సోకింది. కరోనా తీవ్రంగా ఉన్న నాటి కంటే అమరావతిలో ప్రస్తుతం ఎక్కువగా కేసులు వస్తున్నాయి.
Must Read ;- కట్టడిలోనే కరోనా.. దూకుడుగా వ్యాక్సినేషన్..











