తనకు ప్రాణాల విలువ బాగా తెలుసని జగన్రెడ్డి అసెంబ్లీలో చెప్పడం ఈ వందేళ్లలోనే అతి పెద్దజోక్ అని,అబ్బాయ్కి ప్రాణాలు విలువ తెలుసని సొంత బాబాయ్కే పాపం తెలియలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవ చేశారు.ప్రాణాలు విలువ తెలిసిన వాడైతే బ్లీచింగ్, పారాసెటమాల్, సహజీవనం అంటూ కరోనాకి వేలాదిమందిని బలిచ్చేవాడు కాదన్నారు.ప్రాణం విలువ తెలిసినవాడైతే మాస్క్ పెట్టుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచేవాడని పేర్కొన్నారు.రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఒక్కసారైనా అసెంబ్లీ నిర్వహించకపోతే ప్రభుత్వ మనుగడకి ప్రమాదం అని తలచి ఏర్పాటు చేసిన ఒక్కరోజు నామమాత్రపు అసెంబ్లీ సమావేశంలోనూ జనం సమస్యలు విస్మరించి, జగన్ భజనకే ప్రాధాన్యమిచ్చారని ఒక ప్రకటనలో విమర్శించారు.
కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి
కోవిడ్ నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులు మింగేస్తున్నారు,రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపుల్లేవని,కరోనాని ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నించారు.కోవిడ్ రోగుల కోసం 150కి పైగా ల్యాబ్లు అందుబాటులోకి తెచ్చామని గొప్పలు చెప్పిన సీఎం, కోవిడ్ టెస్ట్ ఫలితం వారం రోజులు ఎందుకు పడుతుందో సమాధానం ఇవ్వాలన్నారు.కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఘనంగా ప్రకటించిన జగన్రెడ్డి,బెడ్లు దొరక్క ఆస్పత్రి ఆవరణలోనే రోజూ పదుల సంఖ్యలో ఎందుకు చనిపోతున్నారో వివరణ ఇవ్వాలన్నారు.ఆక్సిజన్ కొరతలేదంటున్నారు,విజయనగరం,రుయా, అనంతపురం ఆస్పత్రులలో కరోనా రోగులు ఎలా చనిపోయారని ప్రశ్నించారు.ఏప్రిల్ నెలలో వ్యాక్సిన్కి ఆర్డర్లు పెట్టాల్సి వుండగా,ఆ కంపెనీలు కమీషన్ ఆఫర్ చేయకపోవడంతో ఆగిపోయి…ఇప్పుడు చంద్రబాబుపైన ఏడిస్తే ఏం ప్రయోజనమన్నారు.
కమీషన్ల దెబ్బకు ఎవరూ ముందుకు రావడం లేదు
నాలుగు బిల్డింగ్లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదని సెలవిచ్చిన జగన్రెడ్డి దృష్టిలో నాలుగు ప్రాంతాలలో విధ్వంసం సృష్టించడం అభివృద్ధా అని నిలదీశారు.జగన్రెడ్డి రంగుల పిచ్చికి ఖర్చుపెట్టిన 3 వేల కోట్లలో 1600 కోట్లు వెచ్చిస్తే రాష్ట్రమందరికీ సరిపడా వ్యాక్సిన్ వచ్చేదన్నారు.ఏపీలో ఒక రోడ్డు వేయడానికి టెండరు వేస్తే కమీషన్ల దెబ్బకు ఒక్కరూ రావడంలేదని,వ్యాక్సిన్ సరఫరాకి వేసిన గ్లోబల్ టెండర్లకు ఇంకెవరు వస్తారన్నారు.తిరుపతి ఎన్నికల్లో వందల బస్సులు, లక్షల దొంగ ఓట్లు తీసేస్తే నీ బులుగు రంగు జెండా ఎలా ఎగిరేదో తేలిపోయేది అన్నారు.ఆర్భాటంగా ఏర్పాటు చేసిన 56 బిసి కార్పొరేషన్లకు నిధుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవటం ఆయా కార్పొరేషన్ల పేరుతో మోసం చేయడమేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 100 కిలోమీటర్ల రోడ్డు వేశాం అని చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు.రెండేళ్లలో 50 వేల కోట్ల అంచనాతో 28 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని చెప్పి,10 శాతం 5600 కోట్లు కేటాయించిన సీఎం,ఎన్నేళ్లకి ఈ ఇళ్లు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.వ్యాక్సిన్ కొనుగోలు కోసం 500 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం.ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?ఇప్పటికైనా గాలి మాటలు,కుల రాజకీయం మాని పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ కొనుగోలుకి నిధులు కేటాయించాలని కోరారు.
Must Read- అసెంబ్లీ సాక్షిగా.. అనుచిత వ్యాఖ్యలు : థ్యాంక్స్ చెప్పిన జగన్;