ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. అయిష్ఠంగానే స్థానిక ఎన్నికలు నిర్వహణకు ఒప్పుకున్నా అందులో కూడా మెలిక పెట్టింది. సాధ్యమైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని వైసీపీ అధినేత ఆదేశించారని తెలుస్తోంది. ఇందుకుగాను ఏకగ్రీవమైన పంచాలయతీలకు జనాభాను బట్టి రూ.5 నుంచి 20 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందే ఈ నజరానా ప్రకటించినా ప్రస్తుతం స్థానిక సంస్థల్లో సగానికిపైగా ఏకగ్రీవం చేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఏకగ్రీవం చేసుకున్న పంచాయతీలకు అభివృద్ధి నిధుల జీవోను తాజాగా విడుదల చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారని తెలుస్తోంది.
బెదిరింపులు మొదలు కానున్నాయా?
చిన్న గ్రామ పంచాయతీలో కూడా రూ.50 లక్షల ఖర్చు చేసి అమీతుమీ తేల్చుకునే ఈ రోజుల్లో స్థానిక సంస్థలను ఏకగ్రీవాలను చేయాలనే ప్రయత్నం వెనుక వైసీపీ ప్రభుత్వం పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కడప, పులివెందులలాంటి ప్రాంతాల్లో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించే అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లాలో ఏకగ్రీవాలకు ఎక్కవ అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఏకగ్రీవాలకు స్థానిక నేతలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. ఆస్తులు అమ్మి అయినా సర్పంచ్ అనిపించుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు.
అందుకే పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే నిధులు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం పాడే పాటే. అయినా గ్రామాల్లో పార్టీలు పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రభుత్వం ఏకగ్రీవం చేసుకుంటే వచ్చే అభివృద్ధి నిధుల డబ్బు కోసం పెద్దగా కక్కుర్తి పడటంలేదు. ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్దపడతారు. కానీ వైసీపీ అధినేత మాత్రం ఏకగ్రీవాలు సాధ్యమైనన్ని ఎక్కువ పంచాయతీల్లో చేయాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారట. దీంతో వారంతా ఇక త్వరలో రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వినకపోతే మరో అస్త్రం సిద్దంగా ఉంది
ఒక వేళ వైసీపీ ప్రజాప్రతినిధుల మాట లెక్కచేయకుండా నామినేషన్లు వేసి ఎన్నికలకు సిద్దం అయితే వారిని ఎలా కట్టడి చేయాలో ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలోనే బయటపడిపోయారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు పెట్టడం, సారాయి పంచడంలాంటి చర్యలకు దిగితే ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా అనర్హత వేటు వేసే చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. అంటే ప్రత్యర్థులు ఎవరైనా ఆవేశపడి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుందని సజ్జల బహిరంగంగానే బెదిరించారు. దీంతో స్థానిక సంస్థల్లో కేవలం వైసీపీ వారే పోటీ చేయాలనే సంకేతాలు పంపినట్టయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Must Read ;- సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?
సంక్షేమ పథకాలు గెలిపించలేవా?
దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. జనవరిలోనే అమ్మఒడి కింద రూ.6 వేల కోట్లు 50 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో జమచేశారు. ఇక 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక నవరత్నాలు ఉండనే ఉన్నాయి. ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు చాలా ఈజీగా గెలిచిపోవాలి. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసి నవరత్నాల పేరుతో కొద్ది మందికి మాత్రమే ప్రయోజనాలు చేకూరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో డీజిల్, పెట్రోల్ ధరలు మండి పోతున్నాయి. ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు పెంచి సగటు ప్రయాణీకులపై భారం మోపారు. ఇక త్వరలో రాష్ట్ర రహదారులపై ప్రజలకు టోల్ గేట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక మందుబాబులు కూడా సంతృప్తిగా లేరనే సమాచారం ఉంది. మందుబాబులకు కావాల్సి బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేసి వారి ఇగోను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆ పార్టీ నేతలు చేయించుకున్న సర్వేలోనే వెల్లడైందనే సమాచారం వస్తోంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో బెదిరించడం ద్వారానే మంచి ఫలాతాలు సాధించాలని చూస్తున్నారని ప్రతిపక్షనాయకులు విమర్శలు చేస్తున్నారు.
Also Read ;- ఐజీ సంజయ్కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు