New Central Cabinet Effect On Two Projects In AP :
కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఏపీకి ఒక్క మంత్రి పదవి దక్కకపోవడమే కాకుండా పోర్టు పోలియోల మార్పు ప్రభావం రాష్ట్రంపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలోని రెండు ప్రధాన ప్రాజెక్టులపై కొత్త క్యాబినెట్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. మోదీ ప్రధానంగా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, భవిష్యత్ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్ విస్తరణ చేపట్టడంతో ఏపీకీ మొండి చేయే మిగిలింది.
రెండు శాఖల్లో మార్పులతో..
రెండు శాఖల్లో మార్పులు ఏపీపై ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి. దీంతో సీఎం జగన్ కష్టాలు మరింత పెరగనున్నాయి. ఈ శాఖల్లో ఒకటి పర్యావరణం కాగా, రెండోది రైల్వే మంత్రిత్వశాఖ. ఏపీలో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకూ పర్యావరణ అనుమతులు లభించలేదు. ఇందుకోసం కేంద్రం వద్ద సీఎం జగన్ చేయని లాబీయింగ్ లేదు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముందు కూడా అప్పటి పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్కు సీఎం జగన్ లేఖ రాశారు. రాయలసీమ లిఫ్ట్కు త్వరగా పర్యావరణ అనుమతులు ఇప్పించాలని, తెలంగాణ అక్రమంగా కృష్ణా నీరు వాడుకోవడం వల్ల దిగువన ఉన్న తమకు సమస్యలు తప్పడం లేదని, సీమ లిఫ్ట్కు త్వరగా పర్యావరణ అనుమతులు ఇప్పించాలని కోరారు. తాజాగా జవదేకర్ రాజీనామాతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. కొత్త పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ దగ్గర మళ్లీ జగన్ కొత్తగా లాబీయింగ్ ప్రారంభించాల్సిందే. ఇది ఎంతకాలం పడుతుందో, వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
విశాఖ రైల్వే జోన్ కథ కంచికేనా..
ఏపీకి విభజన హామీల్లో ఒకటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలోనూ కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తీవ్ర ప్రభావం చూపబోతోంది. రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ స్ధానంలో కొత్తగా ఒడిశాకు చెందిన అశ్వినీ వైష్ణవ్ రాబోతున్నారు. ఇప్పటికే ఒడిశాలోని రాయగడ డివిజన్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం రైల్వే బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. పీయూష్ గోయల్ హయాంలోనే దీని కోసం ప్రయత్నాలు జరిగాయి. ఇక రాయగడ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఏర్పాటైతే ఏపీలోని వాల్తేర్ డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది. ప్రస్తుత పరిణామాలతో ఆ ఆశలు కూడా అడుగంటినట్లే.
Must Read ;- జగన్కు బీజేపీ ఆఫరిచ్చిందా?.. ఇదీ ‘హోదా’లాంటిదేనా?











