దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీకి వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనపై రగలిపోతున్నారని అందుకే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిని గెలిపించారని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అంతలోనే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. ఎప్పటి నుంచో భాగ్యనగరంపై బీజేపీ బావుటా ఎగురవేయాలని చూస్తున్న ఆ పార్టీ కీలక నేత అమిత్ షా, తన మిత్రుడు, మాస్టర్ మైండ్ గా పేరున్న భూపేంద్ర యాదవ్ ను రంగంలోకి దింపారు.
ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో గ్రేటర్ ఎన్నికలు అయ్యే వరకు హైదరాబాద్ నగరాన్ని వీడవద్దని కూడా సూచించారట. ఉత్తరాదిలో కీలక రాష్ట్రాల్లో ఎన్నికల బాధ్యతలు నిర్వహించి కాషాయ జెండాను రెపరెపలాడించిన భూపేంద్ర యాదవ్ ను గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ ఇంఛార్జిగా నియమించింది. ఎలాగైనా గ్రేటర్ లో సత్తాచాటుకుంటే, వచ్చే ఎన్నికల్లో కారుకు బ్రేకులు వేయవచ్చని షా వ్యూహంలో భాగంగానే గ్రేటర్ ఎన్నికలకు భూపేంద్రను రంగంలోకి దింపారని తెలుస్తోంది.
Must Read ;- పవన్ కళ్యాణ్ అంటే బీజేపీకి అంత లోకువా!
ఎవరీ భూపేంద్ర యాదవ్?
రాజస్థాన్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్. తెలుగు వారికి ఈ పేరు కొత్తే అయినా ఉత్తరాది వారికి ఈయన చిరపరిచితుడు. అమిత్ షాకు అనుంగ మిత్రుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో ఉన్న వ్యక్తి. భూపేంద్ర యాదవ్ గురించి చెప్పాలంటే బీజేపీ విజయానికి ఆయన పన్నిన వ్యూహాల గురించే మాట్లాడుకోవాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ బీజేపీ ఇంఛార్జిగా పనిచేసిన భూపేంద్ర యాదవ్, అక్కడ ప్రత్యర్దులను మట్టికరిపించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ లో బీజేపీ కూటమికి మొత్తం 40 ఎంపీ స్థానాల్లో, 39 గెలిచేలా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యూపీ, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించి మంచి ఫలితాలను రాబట్టారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిపించే బాధ్యతలను అధిష్ఠానం భూపేంద్ర యాదవ్ కు అప్పగించింది.
నడ్డా తరవాత భూపేంద్రకు ఛాన్స్…
గత ఏడాది జరిగిన బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో భూపేంద్ర యాదవ్ కూడా పోటీ పడ్డారు. అయితే ప్రస్తుతానికి ఆ పదవి నడ్డాకు అప్పగించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి భూపేంద్ర యాదవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి భూపేంద్ర యాదవ్ కు బీజేపీ పగ్గాలు అప్పగించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతానికి నడ్డాకు పార్టీ పగ్గాలు అప్పగించారని కూడా తెలుస్తోంది. అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా ఉన్న భూపేంద్ర యాదవ్, పలు రాష్ట్రాల్లో బీజేపీ జెండాను రెపరెపలాండించి కాషాయీకరణ చేయడంలో విజయం సాధించారు. బీజేపీ భవిష్యత్ దిక్చూచి భూపేంద్ర యాదవ్ అంటే అతిశయోక్తి కాదేమో.!
Also Read ;- తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?