ఏదేనీ రాజకీయ పార్టీలో ప్రాధమిక సభ్యత్వం తీసుకుంటే.. ఇకపై ఆ పార్టీ కార్యకర్తగా గుర్తింపు అయితే ఉంటుంది గానీ.. పార్టీ అధిష్ఠానం ఆ కార్యకర్తను గుర్తిస్తుందా? ఏదో అలా కార్యకర్తల జాబితాలో అలా పేరుంటుందమో గానీ.. పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ సదరు కార్యకర్తను గుర్తు పెట్టుకోవడం అసాధ్యమే. సరే.. గుర్తింపు లేకున్నా.. ఏదేనీ ప్రమాదమో, ఇతర వైరి వర్గాల నుంచి దాడో జరిగిన సందర్భంలోనైనా పార్టీ అధిష్ఠానం ఆ కార్యకర్తకు అండగా నిలుస్తుందా?.. అంటే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అయితే లేదనే చెప్పాలి. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీకి మాత్రం మినహాయింపు. ఎందుకంటే.. ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఆ బీమా ప్రీమియాన్ని పార్టీనే కడుతుంది. కార్యకర్తకు నయా పైసా ఖర్చ లేకుండా రూ.2 లక్షల దాకా బీమా సౌకర్యం లభిస్తుంది. పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాత ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా టీడీపీకి గుర్తింపు దక్కేలా చేసిన లోకేశ్.. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ రూ.2 లక్షల మేర బీమా సౌకర్యాన్ని కల్పించారు.
కార్యకర్తలకు బీమా.. లోకేశ్ మొదలెట్టిందే
అయినా ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నారా లోకేశ్ బాటలోనే నడుస్తున్నారు. నారా లోకేశ్ అంతగా కాకపోయినా.. తన శక్తి మేరకు పవన్ కూడా తన పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం విజయవాడ చేరుకున్న పవన్.. తన పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇటీవలే మృత్యువాత పడిన పార్టీ క్రియాశీల కార్యకర్త ఆకుల సోమశేఖర్ (కర్నూలు జిల్లా, నంద్యాల వాసి) కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే పార్టీ శ్రేణులకు బీమా సౌకర్యం కల్పిస్తామని, ఇందులో భాగంగా తనవంతుగా బీమా కోసం రూ.1 కోటిని అందజేయనున్నట్లుగా పవన్ సంచలన ప్రకటన చేశారు. కేవలం కోటి రూపాయల మొత్తంతో పార్టీలోని కార్యకర్తలందరికీ బీమా సౌకర్యం దక్కకున్నా.. పార్టీని నమ్ముకున్న వారికి ఇది భరోసా లాంటిదేనని చెప్పక తప్పదు.
అన్ని పార్టీలూ లోకేశ్ బాటలో నడిస్తే..
అయితే పవన్ ఈ దిశగా ఇప్పుడు అడుగు వేస్తే.. నారా లోకేశ్ ఎప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే ఈ దిశగా పార్టీ కార్యకర్తలకు బీమా చేయించిన సంగతి తెలిసిందే. లోకేశ్ చేపట్టిన చర్యల మేరకు.. టీడీపీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఏదేనీ ప్రమాదంలో చనిపోతే.. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందుతుంది. శాశ్వత అంగవైకల్యానికి కూడా ఇంతే మొత్తం అందుతుంది. ఇక పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష మేర పరిహారం టీడీపీ కార్యకర్తకు అందుతుంది. మొత్తంగా లోకేశ్ మొదలెట్టిన ఈ కార్యక్రమం బాటలోకి జనసేనాని కూడా వచ్చేశారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తే ఎంత బాగుంటుందో కదా. అన్ని పార్టీలూ లోకేశ్ బాటలోనే నడవాలని ఆశిద్దాం.
Must Read ;- నిరుద్యోగి ఆత్మహత్య.. నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్