కేంద్రంలో మోదీ మంత్రి వర్గం మార్పు,కూర్పుల కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.ఈ సారి కూడ కొత్తగా తెలుగువారెవరికి మంత్రి వర్గంలో చోటులేదన్న వార్తలొస్తున్నాయి. మోదీ 2.0 టర్మ్లో తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పటికీ ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యమే లేదు. తెలంగాణలోనూ నలుగురు బీజేపీ ఎంపీలున్నప్పటికీ ఒక్కరికే అవకాశం దక్కింది.
పవన్ కల్యాణ్కు కూడా..
ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అయితే ఆయనకు కూడ అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, బీజేపీ మధ్య మైత్రీ బంధం బలపడుతోందన్న వార్తలొస్తున్న నేపథ్యంలో జనసేన అధినేతను కూడ పక్కన పెట్టారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పవన్ కల్యాణే తమ సీఎం అభ్యర్థి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగంగా ప్రకటించినా పెద్ద ప్రభావమే కనిపించలేదు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున తిరుపతిలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా ప్రత్యర్థులకు గట్టి పోటీ కూడ ఇవ్వలేక పోయారు. దీంతో ఢిల్లీలోని బీజేపీ పెద్దల ఆలోచనలు మారినట్లు సమాచారం.
మూడేళ్లుగా ఏపీ నుంచి ఎవరూ లేరు..
ఏపీ నుంచి అయితే మూడేళ్లకుపైగా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యమే లేదు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు క్యాబినెట్ ర్యాంకులో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు, సైన్స్, టెక్నాలజీ సహాయమంత్రిగా సుజనా చౌదరి ఉన్నారు. ఎన్టీఏ నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత వీరిద్దరూ మార్చి 8, 2018న తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అప్పుడు ఏపీలో బీజేపీ తరపున విశాఖ ఎంపీగా కంభంపాటి హరిబాబు, నర్సాపురం ఎంపీగా గోకరాజు గంగరాజులు ఉన్నారు. వీరిలో హరిబాబుకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అప్నటి నుంచి ఏపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఏపీలో స్వతంత్రంగా పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు కూడ సాధించలేక పోయింది.
మోడీ 2.0 లో యూపీకే అగ్ర తాంబూలం
మోదీ 2.0 టర్మ్లో మంత్రి వర్గంలోని 57 మందిలో యూపీకే అగ్ర తాంబూలం దక్కింది. యూపీ నుంచి 9 మంది, మహారాష్ట్ర నుంచి 7గురు, బీహార్ నుంచి 6గురికి అవకాశం లభించింది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రాలయిన ఏపీ, తమిళనాడుల నుంచి ఏ ఒక్కిరికి అవకాశం లభించలేదు. ఈ సారి విస్తరణలో అయినా ఏపీ నుంచి ఎవరికైనా కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారని భావించినప్పటికీ అదేమి లేదన్న వార్తలొస్తున్నాయి. ధిల్లీ బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Must Read ;- చాయ్ వాలాను ఢీకొట్టే నాయకుడి అన్వేషణ.. మోదీ అంటేనే మండిపడుతున్న పీకే











