ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల ధిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో పాటు జల వనరులు, జల్ శక్తి మంత్రి గజేంద్ర షింగ్ షెకావత్లో భేటీ అయ్యారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానుండగా వాణిజ్య, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ను కూడా ఈ పర్యటనలో కలవనున్నారు.
సకాలంలో పోలవరం పూర్తి చేయాలంటూ..
ఇక కేంద్ర జలవనరులు, జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని కోరారు. పోలవరం PPAతోపాటు కేంద్ర జలమండలి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ – టీఏసీ అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న పోలవరం డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులనూ ప్రస్తావించారు. ఇదే అంశాన్ని అంతకు ముందు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో జరిగిన భేటీలో ప్రధానంగా ప్రస్తావించారు. జీఎస్టీకి సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, అవినాష్రెడ్డి, బాలశౌరి, మోపిదేవి వెంకటరమణ సహా మరికొందరు ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.
అమిత్ షాతో భేటీపై చర్చ
కాగా ఏపీ సీఎం అమిత్ షాతో బుధవారం రాత్రి 9 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కొవిడ్ వ్యాక్సిన్లు, నిధులపై చర్చిస్తారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టాయి. జూన్ 14న వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిని కలవడంలో అర్థం ఏంటని ప్రశ్నించాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవినీతి, అక్రమాల కేసులు ఉన్నాయని, ఇటీవల జరిగిన పరిణామాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని విమర్శిస్తున్నాయి. నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు సమయంలో కస్టడీ సమయంలో సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారని న్యాయస్థానాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసులు, సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, ఆర్మీ ఆసుపత్రిలో ఓ అధికారి వ్యవహారశైలిపై ఇప్పటికే దేశంలోని గవర్నర్లకు, ఎంపీలకు, అన్నిరాష్ట్రాల ఎమ్మెల్యేలకు ఆయా స్థానిక భాషలో లేఖలు రాశారు. దీంతో పాటుగా ఇటీవలే పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని కూడా కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ఆధారాలు సమర్పించారు. రఘురామకృష్ణరాజు ధిల్లీలో చేస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రిని కలవడంపై చర్చ నడుస్తోంది. ఇక ప్రతిపక్షాల విమర్శలపై అధికార వైసీపీ ఎదురుదాడికి దిగింది. రాష్ట్ర ప్రయోజనాలే ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రాధాన్య అంశమని, ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ప్రతి విమర్శ చేస్తోంది.
Must Read ;- జగన్ ఢిల్లీ టూర్.. దేశ వ్యాప్తంగా రచ్చకెక్కిన రఘురామ ఎపిసోడ్