దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 89,129కేసులు నమోదయ్యాయి. 714 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 164,110మంది చనిపోగా మొత్తం 1,23,92,260 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. తెలుగురాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏపీలో గత 24గంటల్లో 1398కేసులు నమోదయ్యాయి. యాక్టీవ్ కేసులు పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా నియంత్రణ చర్యలకు ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు అవుతోంది. మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో కరోనా మరింత విజృంభిస్తుందని, ఏప్రిల్ నెలలో రెండో వారం తరువాత గరిష్టస్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్తవేత్తలు అంచనా వేశారు. మే చివరి నాటికి వైరస్ తీవ్రత తగ్గుతుందని అంచనా వేశారు. కరోనా రెండోదశ మార్చిలో మొదలైనట్టు గుర్తించారు.
మహేంద్ర వర్మ సారథ్యంలోని శాస్తవేత్తల టీం అంచనా
మహేంద్ర వర్మ సారథ్యంలోని శాస్తవేత్తల టీం ఈ అంచనాలను రూపొందించింది. సూత్ర మోడల్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు నమోదైన కేసుల తీరును బట్టి ఈ అంచనా వేశారు. ఒడిషాలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, రానున్న కాలంలో ఆ రాష్ట్రంలో మరిన్ని పెరగనున్నాయన్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాలో కేసుల పెరుగుదల ఉండదని సూచించారు. దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కేసులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
సూత్ర అంటే..
SUTRA (Susceptible, Undetected, Tested (positive), Removed (recovered or dead) Approachల గణాంక వివరాల సూత్రీకరణ ద్వారా ఈ మేరకు అంచనా వేశారు. అదే సమయంలో ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తల టీం కొత్త శానిటైజేషన్ బాక్స్ను తయారు చేసింది. సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ బాక్సు ద్వారా కూరగాయల మొదలు మొబైల్స్ లాంటి అన్ని రకాల వస్తువులను శానిటైజ్ చేయవచ్చని తెలిపింది.
గతంలో అంచనాలు ఇవీ..
కాగా ఐఐటీ కాన్పూర్ గతంలో వేసిన అంచనాల దగ్గరగా కొవిడ్ కేసులు నమోదు కావడంతో ఈ సారి విడుదల చేసిన నివేదిక ప్రాధాన్య అంశంగా మారింది. గతంలో ఒడిషా రాష్ట్రంలో కేసుల అంశంపై అంచనాలు రూపొందించడంతోపాటు దేశ వ్యాప్తంగా 2020 సెప్టెంబరులో కొవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరతాయని, 2021 ఫిబ్రవరి నాటికి తగ్గుతాయని అంచనా వేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు ఇలాంటి అంచనాలతోనే నివేదిక విడుదల చేసింది. ఐఐటీ కాన్పూర్తో పాటు ఎస్ బీఐ తో పాటు మరికొన్ని సంస్థలు అంచనా వేసిన ప్రకారం..ఈ నెల 15-20వ తేదీ మధ్యకాలంలో గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. ఇదే నివేదికలో పంజాబ్ను కూడా ఐఐటీ కాన్పూర్ హెచ్చరించింది. మహారాష్ట్రతో పాటు పంజాబ్ లోనూ కేసులు భారీగా నమోదు అవతాయని తేల్చింది. హర్యానా రాష్ట్రంలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ అండ్ టీం కూడా ఇదే అంచనాలను వేసింది. మే చివరి వరకు వైరస్ ఉద్ధృతి కొనసాగుతుందని తేల్చింది.
కేసులు ఇవీ..
కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 89,129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 44,202 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 6,58,909 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24గంటల్లో మహారాష్ట్రలో 47,827 కరోనా కేసులు నమోదు కావడం, అందులో ముంబైలోనే 8,823 కరోనా కేసులు ఉండడంతో దేశ ఆర్థిక రాజధానిలో టెన్షన్ మొదలైంది. కాగా తెలంగాణలో గత 24 గంటల్లో 965కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 254, మేడ్చల్ 110, నిజామాబాద్ లో 64, రంగారెడ్డి పరిధిలో 97, నిర్మల్ జిల్లాలో 39కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలోనూ కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. శనివారం సాయంత్రానికి గడిచిన 24గంటల్లో 1398కేసులు నమోదైనట్టు, తొమ్మిది మంది చనిపోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్











