త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చక చకా జరుగుతున్నాయి. సమకాలీన రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాకి, ‘అయిననూ పోయిరావలె హస్తినకు‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగు పూర్తయిన తరువాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుపైకి రానున్నాడు. ఈ లోగా త్రివిక్రమ్ అన్ని పనులను పూర్తి చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ జోరుగా జరుగుతోంది.
ఈ సినిమాలో రెండు కీలకమైన పాత్రలు ఉన్నాయట .. ఒక పాత్ర కోసం నవీన్ పోలిశెట్టినీ .. మరో పాత్ర కోసం సునీల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్నేహితుడి పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని కనిపిస్తుందట. ఈ పాత్రకోసం నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఈ పాత్రను అడగ్గానే ఒప్పుకున్నాడని అంటున్నారు. హీరోతో పాటు సినిమా అంతా ఈ పాత్ర ట్రావెల్ చేస్తుందని చెబుతున్నారు.
ఇక అసలైన విశేషం ఏమిటంటే .. ఈ సినిమాలో సునీల్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించనున్నాడని చెబుతున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో తన స్నేహితుడైన సునీల్ కోసం మంచి కామెడీ రోల్ సెట్ చేస్తూ ఉంటాడు. అలాంటిది గత రెండు మూడు సినిమాల్లో సునీల్ కు ఆయన సరైన పాత్రలను ఇవ్వలేకపోయాడు. ఈ సినిమాలో సునీల్ తో కామెడీ పండించడం కాకుండా, నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేయించనున్నాడని అంటున్నారు. కొంతకాలంగా సునీల్ విలన్ తరహా పాత్రల్లో మెప్పించడానికి ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే.
Must Read ;- ఎన్టీఆర్ చేతుల మీదుగా నాట్యం టీజర్ రిలీజ్











