ఓటీటీ వచ్చాక వివాదాస్పద కంటెంట్ విచ్చలవిడిగా జనం ముందుకు వచ్చేస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా కసరత్తులు చేసింది. ఎట్టకేలకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎలాంటి మార్గదర్శకాలు ఉండాలో వాటిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్ఫష్టం చేశారు. ఇటీవలే ‘తాండవ్’ వెబ్ సిరీస్ పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలాగే ‘మీర్జాపూర్ ’ కూడా.
ముఖ్యంగా బూతు కంటెంట్ కు వేదికగా ఓటీటీలు మారిపోయాయి. ఇవి సెన్సార్ పరిధిలోకి రాకపోవడం వల్ల ఓటీటీ సంస్థలు యథేచ్ఛగా వీటిని ప్రసారం చేసేస్తున్నాయి. ఇక నుంచి ఇలాంటి కంటెంట్ ను నిషేధించే అవకాశం ఉంది. ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ‘ఓటీటీ కంటెంట్ ను కూడా సెన్సార్ షిప్ పరిధిలోకి తీసుకువస్తాం. వీటి ప్రసారాలకు విధివిధానాలను నిర్ధేశిస్తం. ఇప్పటిదాకా ఇలాంటి మార్గదర్శకాలు లేవు. వీటికి సెన్సార్ బోర్డు కూడా ఏమీ లేదు. ఇప్పుడు మేము దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నాం. మార్గదర్శకాలను రూపొందించాం’అని వివరించారు.
ఇటీవల విడుదలైన కొన్ని వెబ్ సిరీస్ లపై కేసులు కూడా నమోదయ్యాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు జవదేకర్ వివరించారు. ‘తాండవ్’ వివాదం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. గత ఏడాది నవంబరు 11 నుంచి ప్రసారమైన వార్తలు, వీడియోలు లాంటి వాటినన్నింటినీ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. దీనిపై నవంబరు 9న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఓటీటీలో ప్రసారమయ్యే ప్రతి కంటెంట్ ఇకపై ఈ శాఖ పరిధిలోకే వస్తాయి. వీటిని నియంత్రించే అధికారం ఈ శాఖకు ఉంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. త్వరలోనే ఆ మార్గదర్శకాలు విడుదలవుతాయి.
Must Read ;- ఈ ఏడాది సినిమాల తాకిడి.. ఓటీటీ గతేంటి?