రాయలసీమ ఫ్యాక్షన్ కారణంగా భారీగా నష్టం వాటిల్లిన కుటుంబాల్లో మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిదీ ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మినిస్టర్ గా ఉన్న సమయంలోనే ఈ ఫ్యాక్షన్ హత్యల కారణంగా మంత్రి పదవిని కోల్పోవడంతో పాటుగా యావజ్జీవ ఖైదు అనుభవించిన రామసుబ్బారెడ్డి.. ఆ తర్వాతా రాజకీయాలను కొనసాగిస్తున్నారు. తన రాజకీయ జీవితానికే మాయని మచ్చ తెచ్చిన ఫ్యాక్షన్ ను ఎప్పుడో వీడాల్సిన ఈ నేత ఇప్పుడు తన సొంత పార్టీ నేత అనుచరుల చేతిలో తన అనుచరుడు చనిపోతే.. మళ్లీ ప్రతీకారం మాటను వల్లె వేయడం నిజంగానే ఆశ్చరం కలిగించేదే. వెరసి బతికున్నంత కాలం.. ఎంత మేర నష్టం జరిగినా.. తాను మాత్రం ప్రతీకారాన్ని వీడేది లేదని రామసుబ్బారెడ్డి చెప్పేసినట్టైంది.
రాయలసీమ రాజకీయాల్లో పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు కేంద్రంగా రాజకీయం నడుపుతున్న పొన్నపురెడ్డి కుటుంబానికి ఘనమైన చరిత్రే ఉందని కూడా చెప్పాలి. రామసుబ్బారెడ్డి తండ్రి శివారెడ్డి వరుసగా మూడు పర్యాయాలు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శివారెడ్డి మరణం తర్వాత ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామసుబ్బారెడ్డి కూడా వరుసగా రెండు పర్యాయాలు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మొత్తంగా వరుసగా ఐదు పర్యాయాలు అంటే…. 1983 నుంచి 2004 దాకా జమ్మలమడుగులో పొన్నపురెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టిన నాయకుడే లేడన్న మాట. ఆది నుంచి టీడీపీలోనే కొనసాగిన ఈ కుటుంబం ఇటీవలే వైసీపీలోకి మారిపోయింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు చెల్లు చీటి ఇచ్చే దిశగానే ఈ పార్టీ మార్పిడి జరిగిందనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే… టీడీపీ హయాంలో వైసీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చే సమయంలో ఆయన ప్రత్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తీరా 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డితో పాటు ఆదినారాయణ రెడ్డి కూడా ఓటమి పాలు కాగా… ఆదినారాయణ రెడ్డితో సర్దుకుపోలేని కారణంగానే రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారన్న వాదనలు లేకపోలేదు. Also Read ;- అలర్ట్ జగన్ : కడప వైసీపీలో ముసలం
ఇదంతా గత చరిత్ర అనుకుంటే.. తన జీవితంలోనే చెరిగిపోలేని మచ్చ కు కారణమైన ఫ్యాక్షన్ రాజకీయాలను రామసుబ్బారెడ్డి వదులుకునేందుకు సిద్ధంగా లేరని తాజాగా ఆయన నోట నుంచి వచ్చిన ఓ కామెంట్ చెబుతోంది. గండికోట ముంపు గ్రామాలకు ప్రభుత్వ పరిహారం పంపిణీ విషయంలో తలెత్తిన వివాదంతో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి అనుచరులు రామసుబ్బారెడ్డి అనుచరుడు గురునాథ్ రెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో గురునాథ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు.
ఈ గొడవలో ఇటు బాధితుడు, అటు నిందితులు.. ఇద్దరూ వైసీపీకి చెందిన వారే. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి దోషులకు శిక్ష పడేలా చేస్తానని, గురునాథ్ కుటుంబానికి అండగా ఉంటానని రామసుబ్బారెడ్డి ప్రకటించారు. ఇక్కడితో ఆగి ఉంటే బాగుండేదేమో… తనదైన ఫ్యాక్షన్ వాసనలను మరోమారు బయటపెట్టుకున్న రామసుబ్బారెడ్డి… గురునాథ్ రెడ్డిని చంపిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుని తీరతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వింటూ ఉంటే… ఏ మేర నష్టం జరిగినా కూడా పగలు, ప్రతీకారాలను రామసుబ్బారెడ్డి వదిలేలా లేరన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.
AlsoRead ;- పులివెందులలో రియల్ సింగం ,
AlsoRead ;- చెలరేగిన రౌడీలు: కేసు లేదు.. మీడియా పట్టించుకోలేదు!