అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తిక మాసం ఒకటిగా కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రతిరోజూ ఒక విశేషమే కనుక, ఇది నెల రోజులపాటు జరుపుకునే పండుగలా అనిపిస్తుంది.
శివపార్వతులు .. లక్ష్మీనారాయణులు విశేషంగా పూజాభిషేకాలు అందుకునే ఈ మాసంలో, ప్రతిరోజు ఓ పర్వదినమేననే విషయం ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ పర్వదినాలలోని ఆంతర్యాన్ని గ్రహిస్తే భారతీయ ఆధ్యాత్మిక వైభవం ఎలాంటిదో స్పష్టమవుతుంది. కార్తిక శుద్ధ పాడ్యమిని ‘బలి పాడ్యమి’ అని పిలుస్తారు. ఇది బలిచక్రవర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు.
దేవేంద్రుడి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీమహావిష్ణువు వామన అవతారాన్ని ధరించడం .. బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను దానంగా అడగడం .. మూడో అడుగును బలిచక్రవర్తి శిరస్సుపై మోపి అతణ్ణి పాతాళానికి అణచివేయడం .. పాతాళ లోకానికి పాలకుడిగా అతణ్ణి నియమించడం జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి బలిచక్రవర్తిని “బలిరాజ నమస్తుభ్యం విరోచనసుత ప్రభో .. భవిష్యేన్ద్ర సురారాతే పూజేయం ప్రతి గృహ్యతాం” అంటూ స్మరించుకోవాలి. ఈ రోజున ఆవుపేడను ముద్దగా చేసి దానిని ‘గోవర్ధనగిరి’గా భావించి ఆరాధించే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
కార్తిక శుద్ధ విదియకి ‘భాతృ విదియ’ అనే పేరు వుంది. ఈ రోజున స్త్రీలు తమ సోదరులను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానిస్తారు. అక్కా చెల్లెళ్ల ఆహ్వానాన్ని కాదనకుండా, వారు స్వయంగా వండి వడ్డించిన పదార్థాలను సోదరులు భుజించవలసి ఉంటుంది. అన్నదమ్ముల పట్ల అక్కా చెల్లెళ్లు తమ ప్రేమాభిమానాలను చాటుకునే సంప్రదాయం ఇది. జీవితాంతం వారికి తమ సహాయ సహకారాలు వుంటాయని అన్నదమ్ములు భరోసాను ఇచ్చే ఆచారం ఇది. అందువల్లనే దీనిని ‘భాతృ విదియ’ అనీ .. ‘భగినీహస్త భోజనం’ అని అంటారు.
యమధర్మరాజు సోదరి అయిన యమున, పూర్వం ఇదే రోజున తన సోదరుడిని ఇంటికి ఆహ్వానించిందట. ఎంతో ఆత్మీయంగా పలకరించి .. స్వయంగా వంట చేసి .. అతనికి ఇష్టమైన రుచికరమైన పదార్థాలతో భోజనం పెట్టింది. చెల్లెలు చూపించిన ప్రేమానురాగాలకు మురిసిపోయిన యమధర్మరాజు, ఆమె ఐదవతనం వృద్ధి చెందేలా ఆశీర్వదించాడు. అంతేకాదు ఈ రోజున అన్నదమ్ములను ఆప్యాయంగా ఆహ్వానించే స్త్రీలకు వైధవ్యమనేది దరిచేరకుండా పుణ్యస్త్రీలుగా ఉంటారనీ, అక్కా చెల్లెళ్ల చేతి భోజనం చేసిన అన్నదమ్ములకు అపమృత్యు దోషాలు ఉండవని ఆయన వరాలను ఇచ్చాడు. ఈ కారణంగానే ఈ రోజుకి ‘యమద్వితీయ’ అనే పేరు కూడా వచ్చింది.
కార్తిక మాసంలో శివకేశవులు మాత్రమే కాదు, శివుడి మెడను అలంకరించి వుండే వాసుకి, శ్రీమహావిష్ణువు శయనించే ఆదిశేషుడు .. సర్పరూపంలో జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి కూడా పూజలు అందుకోవడం విశేషం. వాసుకి .. ఆదిశేషుడు వంటి సోదరుల కారణంగా నాగజాతి మొత్తం కూడా కార్తిక శుద్ధ చవితి రోజున పూజాభిషేకాలు అందుకుంటారు. కొన్ని ప్రాంతాలవారు ఈ రోజునే ‘నాగులచవితి’గా భావిస్తూ పుట్టలో పాలు పోస్తారు .. ఆవుపాలతో సుబ్రహ్మణ్యస్వామిని అభిషేకిస్తారు. చలిమిడి .. వడపప్పు .. నువ్వుల పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నాగదేవతలను ఆరాధించడం వలన, సర్పదోషాలు .. చర్మ సంబంధమైన వ్యాధులు .. సంతాన సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
కార్తిక శుద్ధ ఏకాదశికి ‘బోధన ఏకాదశి’ .. ‘ఉత్థాన ఏకాదశి’ అనే పేర్లు వున్నాయి. శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే ఈ ఏకాదశి మరింత విశేషమైనదని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్టుగా ‘పద్మపురాణం’లో కనిపిస్తోంది. ఉపవాస దీక్షను చేపట్టి .. రాత్రివేళ హరినామ స్మరణతో జాగరణ చేస్తూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవారికి, ‘అశ్వమేథ యాగం’ చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఒకరికి చేసే అన్నదానం .. వస్త్రదానం, కొన్ని కోట్ల మందికి చేసిన ఫలితాన్ని ఇస్తుందని మహర్షులు సెలవిచ్చారు.
కార్తిక శుద్ధ ద్వాదశినే ‘క్షీరాబ్ది ద్వాదశి’ అని పిలుస్తారు. అమృతం కోసం దేవతలు .. దానవులు పాలసముద్రాన్ని ‘మంథర పర్వతం’తో చిలకడం మొదలుపెట్టిన రోజు ఇది. పాలసముద్రంతో కూడిన పర్వదినం కావడం వలన ‘క్షీరాబ్ది ద్వాదశి’ అనీ .. పాలసముద్రాన్ని చిలకడం ఆరంభించిన ద్వాదశి కనుక ‘చిలుకు ద్వాదశి’ అని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని వెంటబెట్టుకుని శ్రీమహావిష్ణువు బృందావన ప్రవేశం చేస్తాడని చెబుతారు. తులసికోటను బృందావనమని పిలుస్తారు. అందువలన ఈ రోజుకి ‘తులసి ద్వాదశి’ అనే పేరు కూడా వుంది. ఈ రోజున తులసికోటలో లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షంగా ఉంటారనే విశ్వాసంతో అందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో తులసికోటకు ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు.
శివకేశవులకు భేదం లేదనీ, ఒక్కడే అయిన పరమాత్మ .. శివకేశవులుగా ఈ జగత్తును నడిపిస్తున్నాడనే విషయాన్ని ఎంతోమంది మహాభక్తులు ఈ లోకానికి చాటిచెప్పారు. కొన్ని ప్రాచీనమైన శైవ క్షేత్రాలకు శ్రీ మహావిష్ణువు క్షేత్ర పాలకుడిగా ఉండటం .. వైష్ణవ క్షేత్రాలకు సదాశివుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరించడం వారి మధ్య ఎలాంటి భేదం లేదనే విషయాన్ని మరింత స్పష్టం చేస్తుంటుంది.
వారిద్దరూ ఒకరిని ఒకరు ఆరాధిస్తూ ఉంటారనడానికి కనిపించే నిదర్శనాల్లో ‘వైకుంఠ చతుర్థశి’ ఒకటిగా కనిపిస్తుంది. కార్తిక శుద్ధ చతుర్థశికి ‘వైకుంఠ చతుర్థశి’ అని పేరు. ఈ రోజున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి బయలుదేరి కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడి శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శివాలయాల్లో దీపాలు వెలిగించడం వలన హరిహరుల అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.
కార్తిక మాసంలో అత్యంత విశేషమైనదిగా చెప్పబడేదిగా ‘కార్తిక పౌర్ణమి’ కనిపిస్తుంది. లోక కల్యాణం కోసం పరమశివుడు .. త్రిపురాసురులను సంహరించినది ఈ రోజునే. అందువలన ఈ రోజుని ‘త్రిపుర పౌర్ణమి’ అని కూడా పిలుస్తారు. పౌర్ణమి రోజున శైవ .. వైష్ణవ ఆలయాల్లో ఆవునేతితో తడిపిన వత్తులను ఉసిరికాయలపై ఉంచి వెలిగించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున 365 వత్తులను ఆవునెయ్యితో తడిపి వెలిగించడం వలన, ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. పౌర్ణమి రోజున కొంతమంది కేదారేశ్వరస్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈశ్వరుడిని కేదారేశ్వరుడిగా ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసంగా కనిపిస్తుంది.
– పెద్దింటి గోపీకృష్ణ