రంగనాథ్ .. పేరు వినగానే గంభీరమైన రూపం కళ్లముందు మెదులుతుంది. గౌరవం .. మర్యాద కలగలిసిన ఆ రూపం పట్ల ఆరాధనా భావం కలుగుతుంది. రూపానికి తగిన స్వరం .. ఆయనకి వరం. ఆ స్వరంలో ఆత్మీయత ఎంత గొప్పగా పలుకుతుందో .. ఆవేశం కూడా అంతే అద్భుతంగా ధ్వనిస్తుంది. తెలుగు చిత్రపరిశ్రమలో ‘కొంగర జగ్గయ్య’ తరువాత ప్రత్యేకమైన వాయిస్ కలిగిన నటుడిగా రంగనాథ్ కనిపిస్తారు. కథానాయకుడిగా .. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించారు. ఆయన ఏ పాత్రను పోషించినా ఆ పాత్రకి ఒక హుందాతనం వచ్చేది. అలాంటి రంగనాథ్ గురించి, తాజాగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
“రంగనాథ్ అద్భుతమైన నటుడు .. ఆజానుబాహుడు .. ఆయన వాయిస్ ఎంతో గొప్పగా ఉండేది. ఆయన మంచి కవి అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన కవితలు ఎంతో బాగుండేవి. అంతమంచి కవి హృదయం కలిగిన వ్యక్తి, తన జీవితాన్ని అలా ముగించుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. కారణాలు ఏమైనా కావొచ్చుగానీ ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనది కాదు. ఆయన నటించిన చాలా సినిమాలకి మేము రాశాము. ఒక సినిమా గొప్పగా ఆడాలంటే, హీరోతో పాటు ఇతర తారాగణం కూడా ఆయా పాత్రల్లో మెప్పించగలగాలి. అలా తన పాత్రలకి న్యాయం చేస్తూ, శభాష్ అనిపించుకున్న నటుడు రంగనాథ్.
‘ప్రేమంటే ఇదేరా‘ .. ‘కలిసుందాం రా’ సినిమాల్లో ఆయన పాత్రలను ఎంతో పవర్ఫుల్ గా రాశాము. రంగనాథ్ గారు ఒక డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులంతా మంత్రముగ్ధులై చూస్తుండిపోయేవారు .. అది ఆయన గొప్పతనం. పరభాషా నటులకి అవకాశాలు ఎక్కువగా వెళుతుండటం .. ఇక్కడి సీనియర్ నటులకు అవకాశాలు తగ్గుతూ రావడం జరిగింది. దాంతో ఒక ఇబ్బందికర పరిస్థితి తెలెత్తి ఉండవచ్చు. ఏదేమైనా రంగనాథ్ గారి జీవితం ముగియకూడని విధంగా ముగిసింది. ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడి ఉంటారో, ఆయన అభిమానులందరూ కూడా అంతగానూ బాధపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరోసారి కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- గొల్లపూడి మారుతీరావుకి శోభన్ బాబు హెల్ప్!