రాజకీయ రంగంలో ఉంటూనే ప్రేక్షకాభిమానులను అలరించాలని నిర్ణయించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు. మంచి కథతో పాటు దానిని అందంగా తెరకెక్కించగల దర్శకుడు దొరికితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. రెండేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయ రంగంలోనే గడిపిన ఆయన అభిమానుల ఆశలకు అనుగుణంగా మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా వకీల్ సాబ్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా నేపథ్యంలో ఆగిన ఆ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ఆరంభమైంది. ఈ చిత్రం తర్వాత పవన్ మరో నాలుగైదు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. దర్శకులు క్రిష్, హరీష్ శంకర్ చిత్రాలను కూడా పవన్ చేస్తున్నారు. ఇంకోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఆయన సినిమా అంగీకరించారు. ఈ ప్రాజెక్టులు అన్నిటికంటే ముందు.. వకీల్ సాబ్ తర్వాత అయ్యప్పనుమ్ కోషియం అనే మలయాళ రీమేక్ పవన్ చేయనున్నట్లు సమాచారం.
దివంగత దర్శకుడు, రచయిత సచీ దర్శకత్వంలో రూపొందిన అయ్యప్పనుమ్ కోషియుం చిత్రం మలయాళంలో 50 మిలియన్ల ఖర్చుతో రూపొంది దాదాపు 520 మిల్లియన్లు రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో సహజంగానే ఈ చిత్రంపై తెలుగు చిత్ర పరిశ్రమ కన్నుపడింది. ఈ సినిమా దర్శకుడి మీద ఇంకా స్పష్టత లేదు. మలయాళంలో బిజుమీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. బిజుమీనన్ పాత్రలో పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ పాత్రలో రానా నటిస్తారని ప్రచారం జరుగుతోంది.
రానాతో పాటు సుదీప్ పేరు కూడా ఈ పాత్రకు వినిపిస్తోంది. అయితే ఎవరు ఖరారవుతారో చూడాలి. ఓ పోలీస్ అధికారి, రిటైర్డ్ హవల్దార్ మధ్య సాగే ఈగో యుద్ధమే ఈ చిత్ర ప్రధానాంశం యాక్షన్ థ్రిల్లర్ కథ అయినప్పటికీ వినోదానికి పెద్ద పీట వేశారట. ఇక మంచి అభినయాన్ని పలికించ నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఇందులో కథానాయికగా మెరుస్తారని వినిపిస్తోంది.
AlsoRead ;- జనసేనను నమ్ముకుని.. బరిలో తొడకొడుతున్న బీజేపీ!











