పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందాల భూమిక జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఖుషీ’. సూర్యా మూవీస్ బ్యానర్ పై ..యస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మరిచిపోలేనిది. తమిళంలో దళపతి విజయ్, జ్యోతిక నటించిన సూపర్ హిట్ మూవీ ఖుషీకిది రీమేక్ వెర్షన్. ఇందులోని పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ , డైలాగ్స్, ఫైట్స్ , పాటలు , భూమికతో రొమాంటిక్ సన్నివేశాలు అప్పటి యువతరాన్ని ఊర్రూలూగించాయి. అప్పట్లో ఈ సినిమా రూ.20కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2001, ఏప్రిల్ 27 న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
తమ స్నేహితుల ప్రేమను సఫలం చేయడానికి రంగంలోకి దిగిన సిద్ధూ, మధు ప్రేమలో పడడమే ఈ సినిమా కథాంశం. ఆ క్రమంలో వారిద్దరి మధ్య చిలిపి తగాదాలు, మాట పట్టింపులు, మూతి విరుపులు, మాట యుద్ధాలు.. ఎంతో అందంగా తెరమీద ఆవిష్కారమయ్యాయి. మణిశర్మ సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ అభిమానుల్ని ఉర్రూతలూపుతునే ఉన్నాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. ఇందులోని ఆయన మేనరిజమ్స్ .. అందరికీ మేనియా గా మారిపోయాయి.
ఇక ఖుషీ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ సినిమాతో మొదటి సారిగా పవన్ సినిమాలో ఏ మేరా జహా.. అనే పూర్తి స్థాయి హిందీ పాటను కంపోజ్ చేశాడు మణిశర్మ. అలాగే .. మిస్సమ్మ సినిమాలోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే రీమిక్స్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఆ పాటను సినిమాకే హైలైట్ గా మార్చాడు దర్శకుడు సూర్య. ఇంకా ఈ సినిమాలో పవర్ స్టార్ మొదటి సారిగా పాడిన బైబై యే బంగారు రవణమ్మ జానపదగీతం అభిమానుల్ని ఎంతగానో మెప్పించింది. అలాగే.. ఇందులోని కార్నివాల్ ఫైట్ ను పవన్ స్వయంగా కంపోజ్ చేశారు. అలాగే ఇందులో పవన్ చేసిన ఐకిడో మార్షల్ ఆర్ట్స్ అప్పటి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి పవర్ స్టార్ కస్ట్యూమ్స్ ను రేణుదేశాయ్ స్వయంగా డిజైన్ చేశారు. ఇక పీసీ శ్రీరామ్ కెమేరా పనితనం ఖుషీ చిత్రాన్ని .. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. 20 ఏళ్ళయిపోయినప్పటికీ.. ఈ సినిమాను పవర్ స్టార్ అభిమానులు ఇంకా ఆస్వాదిస్తూనే ఉన్నారు.
Must Read ;- తండ్రీ కొడుకులుగా పవర్ స్టార్ ద్విపాత్రాభినయం?











