ఏపీ సీఎం జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వారే కదా. జిల్లాలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆయన కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి.. చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన రాజంపేట ఎంపీగా కొనసాగుతున్న సంగతీ తెలిసిందే. పెద్దిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో పీఎల్ఆర్ పేరిట ఓ బడా కంపెనీనే ఉంది. ఈ కంపెనీకి చిత్తూరు జిల్లాలో చాలా ఆస్తులే ఉన్నాయి. తిరుపతితో పాటు చంద్రబాబు సొంతూరు చంద్రగిరి సమీపంలో కూడా ఓ ఫంక్షన్ హాలు కూడా ఉంది. ఇవన్ని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. గురువారం నాడు పెద్దిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. తన సొంత జిల్లాలో ప్రస్థానం ప్రారంభించి దేశంలోనే తన రంగంలో అత్యుత్తమ కంపెనీగా ఎదిగిన అమరరాజా గురించి తనకు తెలియనే తెలియదని పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు.
ఒకే పార్టీలో పెద్దిరెడ్డి, గల్లా అరుణ
అమరరాజా కంపెనీని ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్న టీడీపీ యువ నేత గల్లా జయదేవ్ తండ్రి గల్లా రామచంద్రనాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో కలిసి పెద్దిరెడ్డి చదువుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక చంద్రగిరీకే చెందిన గల్లా రామచంద్రనాయుడు కూడా వయసులో వీరికి కాస్త అటూఇటూగా ఉంటారు. అంతేకాకుండా గల్లా అరుణ తండ్రి రాజగోపాల నాయుడు నాడు జిల్లాకు చెందిన చాలా మంది యుత నేతలకు రాజకీయ గురువు కూడా. అంతేనా.. గల్లా అరుణ కుమారి, పెద్దిరెడ్డి మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు కూడా. వైఎస్ హయాంలో వీరిద్దరూ మంత్రి పదవుల్లోనూ ఉన్నారు. సో.. గల్లా అరుణ కుమారి కుటుంబం గురించి తెలియదని పెద్దిరెడ్డి చెప్పినా.. అది అబద్ధమనే చెప్పాలి. ఇక గల్లా ఫ్యామిలీకి చెందిన అమరరాజా గురించి తనకేమీ తెలియదని, ఆ కంపెనీ గురించి మీడియాలో చూసి తెలుసుకున్నానంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. ప్రస్తుతం టీడీపీలో ఉన్న గల్లా ఫ్యామిలీపైనా, వారి ఆధ్వర్యంలోని అమరరాజాపైనా పెద్దిరెడ్డికి ఏ పాటి ద్శేషముందో ఇట్టే చెప్పేయొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పెద్దిరెడ్డి ఏమన్నారంటే..?
అయినా మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి ఏమన్నారంటే.. ‘‘అమరరాజా బ్యాటరీ కంపెనీ తరలిపోవాలని కోరుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాంతీయ కార్యాలయం ఇచ్చిన ఆదేశాలను ఆ కంపెనీ పాటించకుండా మా ప్రభుత్వం ఏదో ఇబ్బందులు పెడుతున్నట్లు వ్యవహరించడం సరికాదు. ఆ కంపెనీ చేస్తున్న వాదనలో పస లేదు. కేవలం ప్రభుత్వాన్ని, సిఎం జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా డ్యామేజ్ చేయడానికేనని అలా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా కెమికల్ ఇండస్ట్రీస్ పదేళ్ళ తరువాత రీ లోకేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిబంధనలకు లోబడి వ్యవహరించకుండా ప్రభుత్వం నిర్ణయాలపై కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడం సమర్ధనీయం కాదు. అయినా అమరరాజా గురించి నాకు ప్రత్యేకంగా ఏమీ తెలియదు. మీడియాలో వచ్చిన మేరకే తెలుసు’’ అంటూ పెద్దిరెడ్డి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లాకు చెందిన, సుధీర్ఘ కాలం పాటు ఒకే కంపెనీలో కలిసి సాగిన గల్లా ఫ్యామిలీకి చెందిన కంపెనీ గురించి తనకు తెలియదని చెప్పిన పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి.
Must Read ;- ఫలించిన టీడీపీ పోరు!.. ‘బాక్సైట్’ బద్దలే!