ఫైజర్.. ప్రస్తుతం చాలా దేశాల్లో ప్రయోగాల దశను దాటి ప్రజలకు నేరుగా అందించడానికి అనుమతులు పొందిన ఏకైక వ్యాక్సిన్ అని చెప్పచ్చు. అటువంటి వ్యాక్సిన్ భారత్ లోకి ఎప్పుడు అడుగుపెడుతుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. కానీ, ఫైజర్ ధర, నిర్వహణ ఖర్చు అంచనా వేసిన ప్రభుత్వం ఫైజర్ను భారత్కు తీసుకురావడం దాదాపు అసాధ్యమనే భావనకు వచ్చింది. కానీ, టీకా ఆశల్ని సజీవం చేస్తు ఫైజర్ సంస్థ ప్రకటన కొత్త ఆశల్ని రేపింది.
ఖర్చు తడిసి మోపెడు
ఫైజర్ ఒక డోసు ధర దాదాపు మన 1500 వరకు అవుతుంది. రెండు డోసులు వేయాలంటే 3000 వరకు ఖర్చవుతుంది. ఇక ఫైజర్ నిర్వహణ ఖర్చు తలుచుకుంటే అసలు తట్టుకోగలమా అనిపిస్తుంది. మైనస్ 70 డిగ్రీల దగ్గర టీకా స్టోర్ చేయడంతో పాటు.. అలాగే నిర్వహిస్తూ దేశమంతా వ్యాక్సిన్ని సప్లై చేయడమంటే మాటలా! వీటి గురించి లెక్కలు వేసిన ప్రభుత్వం ఫైజర్ను భారత్కు రప్పించడంలో ఆలోచనలో పడింది. పైగా ఫైజర్ అలర్జీ ఉన్నవారికి ఇచ్చే అవకాశాలు లేవు. కొన్ని ఫైజర్ తయారీ విధానంలోని మర్పులు వల్ల 70 కంటే ఇంకా తక్కువ డిగ్రీలులో నిల్వ చేయాల్సిన పరిస్థితులు ఉన్నట్లు తాజాగా అమెరికాలో బయటపడడంతో, ప్రభుత్వం ఫైజర్ గురించిన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
Must Read ;- అమెరికాలో మొదలైన వ్యాక్సినేషన్..
ధరను తగ్గిస్తాం.. నిర్వహణలో మార్పులు చేస్తాం..
ఈ పరిస్థితులను గమనించిన ఫైజర్ సంస్థ ధరను దేశానికి తగ్గట్టుగా సవరిస్తున్నట్లు ప్రకటించింది. భారత్తో పాటు మరి కొన్ని దేశాల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆయా దేశాలకు తగ్గట్టుగా ఫైజర్ ధరను మారుస్తామని తెలియజేసింది. అంతేకాదు, నిర్వహణ విషయంలో కూడా మార్పులు చేయనున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ తరలింపులో మైనస్ 70 డిగ్రీలు నిర్వహిచడం తప్పనిసరి అవుతుంది. వ్యాక్సిన్ హాస్పిటల్స్కి చేరిన తర్వాత ఫ్రీజర్లో 2-8 డిగ్రీల మధ్య నిల్వ ఉంచితే సరిపోతుందని కంపెనీ తెలియజేసింది. కానీ 5 రోజుల వరకు మాత్రమే అలా చేయగలమని, ఈ లోగా వాటిని ఉపయోగించడం తప్పని సరి అని తెలియజేసింది. ఇలా దేశ పరిస్థితులకు తగ్గట్టుగా ఫైజర్ కంపెనీ మార్పులు చేపడుతుండడం వ్యాక్సిన్ భారత్కు అడుగుపెట్టే అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
దేశీయ వ్యాక్సిన్ పైన భారత్ చూపు
కొవిషీల్డ్, కొవ్యాక్సిన్, ఫైజర్ టీకాల విడుదలకు భారత్ త్వరితగతిన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అత్యవసర అనుమతులు ఇవ్వాల్సిందిగా ఈ మూడు టీకాలు భారత్ డిసిజీఐను కోరిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ల పనితీరు, సామర్థ్యం, ఎంత వరకు సురక్షితం అనే అంశాలను ఈ నెల 19న పరిశీలించనున్నట్లు డిసీజీఐ ప్రకటించింది. ఒకవేళ అనుకున్న తీరులో అనుమతులు లభిస్తే, ఫైజర్ కంటే కొవిషీల్డ్, కొవ్యాక్సిన్లకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒక డోసును రూ 250 కు అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సీరమ్ అధినేత అదార్ పునావాలా ప్రకటించడంతో ప్రభుత్వం కొవిషీల్డ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
Also Read ;- టీకా పంపిణీకి కేంద్రం, రాష్ట్రాల అత్యవసర ఏర్పాట్లు