పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. కానీ అదేంటోగానీ ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ కే పూనకం వచ్చింది. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పబ్లిక్ గా చాలామందిని ఏకిపారేశారు. కొందరిపై ప్రత్యక్షంగా, ఇంకొందరిపై పరోక్షంగా మాటల దాడి చేశారు. పవర్ స్టార్ ఇలా చెలరేగిపోతారని ఎవరూ ఊహించలేదు. తన పేరులో ఉన్న పవర్ కు తన స్టామినాని జతచేశారు. ఊహించని ఈ పరిణామానికి చాలామంది అవాక్కయ్యారు.
తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కోమాలో ఉండటం, దర్శకనిర్మాతలు ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ను పొలిటికల్ ఈవెంట్ గా మార్చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటు మీడియాను, అటు తోటి హీరోలనూ, పాలకులనూ ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. దాదాపు గంటకు పైగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఘాటైన పదజాలం, సెటైర్లు.. ఓ పక్క ఆవేదన, ఇంకో పక్క ఆగ్రహం, మరో పక్క ఆవేశం, ఆక్రోశం.. ఇలా ఆయన మాటల ప్రవాహం సాగిపోయింది.
అసలు దడ మొదలైంది..
ఏపీ ప్రభుత్వ పరంగా ఏం జరిగినా ఇండస్ట్రీ పెద్దలు కుక్కిన పేనులా పడి ఉన్నారు. ఏం జరిగినా ఎవరూ స్పందించడం లేదు. రాత్రి పవర్ స్టార్ ఇలా చెలరేగిపోవడంతో అందరిలోనూ గుండె దడ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం తన మీద కక్షతో సినిమా ఇండస్ట్రీపై కసి తీర్చుకుంటోందన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆరోపణ. థియేటర్ల పరంగా ఏపీలో పరిస్థితులు చక్కబడక పోవడంతో చాలా సినిమాలు విడుదల వాయిదా పడిపోయింది. రాత్రి పవన్ కళ్యాణ్ బ్లాస్ట్ అవడంతో అగ్గి మీద ఆజ్యం పోసినట్లయింది. ఇకముందు ఏంజరగబోతుందోనని చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్త ఆయన సంయమనం పాటించి ఉంటే బాగుండేదని ఒక వర్గం అంటోంది. దీని వల్ల మున్ముందు పరిస్థితి మరింత జటిలంగా మారుతుందేమోనన్న భయం ఉంది. లేదు.. ఎవరో ఒకరు గళం విప్పి మాట్లాడాల్సిందే.. ఆ ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ చేశారంటూ ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్ ను రాజకీయ వేదికగా మార్చి ఉండకూడదని ఇంకొందరంటున్నారు. సినిమా రంగంలో ఇంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరూ మాట్లాడలేరని, ఆయనిలా బ్లాస్ట్ అవడమే మంచిదని అంటున్నారు.
పవర్ స్టార్ ప్రసంగం మాత్రం పాలకవర్గాల్లోనూ, సినిమా వర్గాల్లోనూ ప్రకంపనలు పుట్టించింది. కచ్చితంగా దీని మీద పాలకవర్గం ప్రతిస్పందించి ప్రతి దాడి చేసే అవకాశం మాత్రం కనిపిస్తోంది. సీఎం జగన్ తో పాటు మీడియాపైనా మాటల తూటాలు పేల్చారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై మీడియా చేసిన అతి, టాలీవుడ్ ను ఇబ్బంది పెడుతున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు, మా ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అంశంతో పాటు బాలయ్య, అన్నయ్య అన్నది కూడా చూడకుండా విమర్శలు గుప్పించారు. తనలో ఉన్న ఆవేశాన్ని కక్కడానికే ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారేమో అన్న భావన అందరికీ కలిగింది. ఆఖరికి తన అభిమాని మీద కూడా కస్సుమన్నారు. ఆఖరికి తన మీద కూడా సెటైర్లు వేసుకున్నారు. పవర్ లేకపోయినా తాను పవర్ స్టార్ ఎలా అవుతానన్నారు.
Must Read ;- స్టాలిన్తో చిరు భేటీ జగన్ను నొప్పించిందా?











