వీధి భాగోతాలు పోయి నాటకాలు వచ్చాయి.. ఆ నాటకాలు థియేటర్ల దాకా ఎక్కాయి. రోజులు మారాయి.. నాటకాల స్థానాన్ని సినిమాలు భర్తీ చేశాయి.
సినిమా ఆడాలంటే థియేటర్లు కావాలి. అలా బోలెడు థియేటర్లు ఏర్పడ్డాయి. కొన్ని రైస్ మిల్లులు కూడా థియేటర్ల రూపానికి సంతరించుకున్నాయి. ఇప్పుడా థియేటర్లు మల్టీ ప్లెక్స్ లుగా మారాయి. సినిమాలు కాస్తా తమ స్వరూపాన్ని మార్చుకుని వెబ్ సిరీస్ రూపంలోకి మారుతున్నాయి. థియేటర్ లు ఏకంగా ఇంట్లోకి నడిచి వచ్చేశాయి. ఇదంతా కాలం తెచ్చిన మార్పు. పెరుగుట విరుగుట కొరకే అనే మాట అక్షర సత్యం కాబోతున్నదా? అన్న సందేహం కలుగుతోంది. ఒకప్పుడు ఇల్లు కట్టుకుంటే అందులో పెద్దగా హాలు ఏర్పటయ్యేది. ఇప్పుడు అదే హాలు హోమ్ థియేటర్ గా మారుతోంది.
కొత్త ఇల్లు కట్టుకునే వారంతా చక్కటి థియేటర్ ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. 10-12 సీట్లతో థియేటర్లు ఏర్పటవుతున్నాయి. అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసుకునే వారు కూడా అందులో ఓ థియేటర్ ఏర్పాటుచేసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అంటే సినిమా ఇంటికే వచ్చేసిందన్న మాట. కరోనా కర్కశత్వం ఓటీటీకి వరంగా మారటంతో ఎప్పుడో రావాల్సిన మార్పు కాస్తంత ముందుగానే వచ్చేసింది. ఇప్పుడు వినోద రంగంలో ఓటీటీదే హవా. ఓటీటీ తర్వాత ఇంకేమొస్తుందో తెలియదుగానీ థియేటర్ మాత్రం ఇంట్లోనే ఉండే రోజులు వచ్చేశాయి.
సినిమా వారితోనే నాంది
ఇంట్లోనే థియేటర్ ఉండాలన్న ఆలోచన సినిమా వారి నుంచే మొదట వచ్చింది. మొదట అగ్రహీరోలంతా తమ ఇళ్లల్లోనే మినీ థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన సింహాద్రి చేసే రోజుల్లోనే ఓ మినీ థియేటర్ ను ఏర్పాటుచేసుకున్నారు. అదిప్పుడు పెద్ద థియేటర్ గా మారిపోయింది. ఇప్పుడు అగ్రహీరోలందరికీ సొంత థియేటర్లు ఉన్నాయి. ఇది వరకూ ప్రసాద్ ల్యాబ్, రామానాయుడు ప్రివ్యూ థియేటర్, ఫిలింఛాంబర్ థియేటర్, అన్నపూర్ణ, పద్మాలయ, శబ్దాలయ ప్రివ్యూ థియేటర్ వంటి వాటికి వెళ్లి తమ సినిమాలు చూసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేరే నిర్మాతలుగానీ, దర్శకులు గానీ పెద్ద హీరోలకు సినిమాలు చూపించాలనుకున్నప్పుడు మాత్రమే ప్రివ్యూ థియేటర్లకు హీరోలను ఆహ్వానిస్తున్నారు.
డిజిటల్ టెక్నాలజీ వచ్చాక చక్కటి అధునాతన థియేటర్లను ఇంట్లోనే ఏర్పాటుచేసుకోవడం సులభతరమైంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ప్రొజెక్టర్లతో థియేటర్లలో చూసిన అనుభూతిని ఈ హోమ్ థియేటర్లు అందిస్తున్నాయి. దాదాపు 20 లక్షల నుంచి కోటి రూపాయల వ్యయంతో ఇలాంటి థియేటర్లు ఏర్పాటవుతున్నాయి. హీరోలకే కాదు కొందరు దర్శకులకు కూడా ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. దర్శకుడు కోదండరామిరెడ్డికి కూడా ఇలాంటి థియేటర్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్, ప్రభాస్ లాంటి వారందరికీ థియేటర్లు ఉన్నాయి.
సామాన్యులు సైతం
సినిమా సెలబ్రిటీలకే పరిమితమైన ఈ థియేటర్లు ఇప్పుడు సామాన్యుల ఇళ్లకు కూడా వచ్చేస్తున్నాయి. ఎంత చెట్టుకు అంతగాలిలా థియేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన పెద్ద సైజ్ ఎల్ఈడీ టీవీలు, 8 కే టీవీలు దాదాపు థియేటర్ అనుభూతిని అందిస్తున్నాయి. అయితే వీటిని ఇప్పుడు పేదలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఓమాదిరి మధ్య తరగతి వారు కూడా థియేటర్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీవీల తయారీ కన్నా థియేటర్ అనుభూతిని తామే అందించే ఏర్పాటు మీద టీవీ కంపెనీలు కూడా దృష్టిపెట్టాయి. టీవీల స్థానాన్ని ప్రొజెక్టర్లు భర్తీ చేస్తున్నాయి.
సౌండ్ ఎఫెక్ట్స్ కూడా థియేటర్ అనుభూతికి ఏమీ తక్కువ ఉండటం లేదు. పక్కింటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప ఎలాంటి అనుభూతిని అయినా వీటి ద్వారా పొందవచ్చు. ఈ పరిణామం సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. భారీ చిత్రాల నిర్మాణానికి చరమగీతం పాడవచ్చు. ఏఏ రంగాల మీద ఈ ప్రభావం పడబోతుందో చూడాలి. రానున్న రెండు మూడేళ్లలో వినోద రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఓటీటీ కోసమే ప్రత్యేకంగా చిత్రాల నిర్మాణం ప్రారంభమైంది. ఇంటిలో సినిమా హాలు.. ఇంతలోనే ఎంత మార్పు? ఇదే రేపటి సినీమాయా బజార్ అన్నమాట.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- కేజీఎఫ్ 2 చిత్రానికి రూ. 255 కోట్ల ఓటీటీ ఆఫర్?











