టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఇన్ఛార్జిగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డిలో నియామకంలో టీఆర్ఎస్ పాత్ర ఉందన్నారు. అందులో భాగంగానే తమిళనాడులో తెలంగాణ ఇంటిలిజెన్స్ టీమ్లు పర్యటిస్తున్నాయని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక రెండు రోజుల క్రితం రేవంత్రెడ్డి జమిలి ఎన్నికలపై చేసిన కామెంట్లు రాజకీయవర్గాలోనూ చర్చనీయాంశంగా మారాయి.
‘అధ్యక్ష తరహా పాలనకు బీజేపీ కుట్ర’
జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోతుందని, దేశ విభజన ఉద్యమం మరోసారి జరుగుతుందన్నారు. జమిలి ఎన్నికల పేరుతో అధ్యక్ష తరహా పాలనకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ విమర్శించారు. అలా జరిగితే..దేశాధ్యక్షుడు కావడానికి దక్షిణాది బలం అవసరం లేదని భావిస్తున్నారని, దక్షిణ భారతదేశ ప్రాధాన్యం కోల్పోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఇక గత ఏడాది బడ్జెట్ సందర్భంగా కూడా ఆయన అప్పట్లో పలు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కడుతున్న పన్నులను బీజేపీ ప్రభుత్వం ఉత్తర భారతదేశానికి మళ్లిస్తోందని, యూపీ రాష్ట్రం కేంద్రానికి రూ.1 పన్ను చెల్లిస్తే కేంద్రం రూ.2 తిరిగి ఇస్తుందని, బీహార్కు రూ.1 కి రూ.1 తిరిగి ఇస్తుందని, దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం రూ.1 పన్ను చెల్లిస్తే రూ.65 పైసలు మాత్రమే ఇస్తోందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి దక్షిణాదికి చెందిన వారైనా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారారని గతంలోనూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి.
Must Read ;- దారులే వేరు.. ఇందిర, మోదీలిద్దరికీ అధికారమే పరమావధి!

కీలకమైన సమాచారం ఏదైనా ఉందా..
సాధారణంగా ఎలాంటి ఆధారాలు, సమాచారం లేకుండా రేవంత్ మాట్లాడే అవకాశం లేదని రాజకీయ నాయకుల్లో చర్చ నడుస్తుంది. కేవలం బడ్జెట్పైనే కాకుండా ఏకంగా జమిలి ఎన్నికల పేరుతో కుట్ర జరుగుతోందనే రీతిలో రేవంత్ వ్యాఖ్యానించారంటే.. కీలకమైన సమాచారం ఏదైనా ఉందా అనే చర్చ మొదలైంది. అంతేకాదు.. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటకలో బీజేపీ, మిత్ర పక్షాల ప్రభుత్వాలు ఉన్నాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్థానిక పార్టీలు అధికారంలో ఉన్నాయి. వీటిలో కేరళలో LDF, తమిళనాడు, కర్ణాటకల్లో బీజేపీ మిత్రపక్షాలు, ఏపీలో YSRCP, తెలంగాణలో TRS అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కేరళ, తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరో సెంటిమెంట్ కోణంలో చూడొచ్చని చెబుతున్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. కరూర్ లోక్సభ పరిధిలోని వెదసంతోర్, అరవకురిచి, కరూర్, క్రిష్ణరాయపురం, మనప్పారై, విరలిమాలై తదితర ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఎంపీ జ్యోతిమణి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఈ ఎన్నికల్లో AIADMK బీజేపీ పొత్తు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో దక్షిణాది సెంటిమెంట్ ను రేవంత్ తెరపైకి తెచ్చారు. ఇక తమిళనాడుకు చెందిన ఓటర్లు కూడా హైదరాబాద్లో దాదాపు 2లక్షల మంది ఉంటారన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని తెలుస్తోంది.
టీఆర్ఎస్ను ఇరుకున పెట్టే యత్నం
అదే సమయంలో రేవంత్రెడ్డి టీఆర్ఎస్ను కూడా ఇరుకున పెట్టే యత్నం చేశారు. తెలంగాణకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కడం లేదన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. రెండు రోజుల క్రితం వచ్చిన బడ్జెట్లోనూ అదే పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ మొత్తం బీజేపీపై విరుచుకుపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు టీఆర్ఎస్ పెదవి విరవడం తప్ప పెద్దగా విమర్శ చేయలేదన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో అటు బీజేపీని, ఇటు టీఆర్ఎస్ను టార్గెట్ చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెబుతూనే దక్షిణాది సెంటిమెంట్ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
Also Read ;- తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్











