మూడు రాజధానులు కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న శిబిరంలో మీడియా అధినేతల దిష్టిబొమ్మలు పెట్టి నినాదాలు చేస్తున్నారు. ఆ దిష్ఠి బొమ్మలను ఏ క్షణంలోనైనా తగులబెట్టే ప్రమాదం ఉంది. అయినా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. కానీ మందడంలో రైతులు అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దిష్టి బొమ్మలను పెడితే తుళ్లూరు డీఎస్పీతో సహా 300 మంది పోలీసులు దిగిపోయారు.
రైతులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు
మందడం, వెలగపూడి గ్రామాల రైతులు మంత్రుల దిష్టి బొమ్మలను తయారు చేసి ప్రదర్శిస్తేనే తీవ్ర రచ్చ చేసిన పోలీసులు, మూడు రాజధానులు కావాలంటూ శిబిరం నిర్వహిస్తోన్న కొందరు కూలీలు మీడియా అధినేతల ఫోటోలు పెట్టి దిష్టిబొమ్మలు తయారు చేసినా పోలీసులు అటువైపు కూడా తిరిగి చూడలేదు. మందడం, వెలగపూడి రైతులను రెండు రోజుల కిందట పోలీసు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. మూడు రాజధానుల శిబిరంలో కూడా దిష్టి బొమ్మలు లేకుండా చేస్తామని అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. కానీ అవేమీ తెలియనట్టే తుళ్లూరు పోలీసులు వ్యవహరించడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని వెలగపూడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడు రాజధానుల శిబిరంలో 8 గంటల డ్యూటీ
మూడు రాజధానులు కావాలంటూ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే టెంటు వేయించి, వారికి అన్నీ ఏర్పాట్లు చేస్తోన్న అధికార పార్టీ నేతలు, వారికి సరిగా పేమెంట్లు ఇవ్వడం లేదని గొడవలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. మంగళగిరి కాలనీల నుంచి ప్రతి రోజూ 20 ఆటోల్లో జనాలను మూడు రాజధానుల శిబిరాలకు తరలిస్తున్నారు. వారికి రోజుకు రూ.800 కూలీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ చేతికి రూ.600 ఇవ్వడంతో బుధవారం శిబిరం వద్ద గొడవ చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ వ్యవహారం మీడియాకు పొక్కకుండా వైసీపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. మూడు రాజధానుల శిబిరం వద్దకు వ్యతిరేక మీడియా వచ్చినా ఏమీ మాట్లాడవద్దని వారికి ముందే హుకుం జారీ చేశారని తెలుస్తోంది. అందుకే కొన్ని ఛానళ్లకు మూడు రాజధానుల శిబిరాల కూలీలు బైట్లు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది.
రేపటితో శిబిరం మూసేస్తారట..
అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మూడు రాజధానుల శిబిరాలు నిర్వహించాలని వైసీపీ నేతలు నిర్ణయించారని తెలుస్తోంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియనున్నాయి. ఆ వెంటనే శిబిరాన్ని కూడా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూలీలకు సకాలంలో డబ్బు అందకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వారు మీడియాలో పడితే ఇక పరువు పోతుందని, రేపటితో మూడు రాజధానుల శిబిరం క్లోజ్ చేయాలని మంగళగిరి వైసీపీ నేత భావిస్తున్నారట. చూద్దాం ఏమి జరగనుందో….
Must Read ;- బీఏసీలో అచ్చెన్నపై జగనన్న హాట్ కామెంట్లు











