Saidabad Murder Accused Raju Commits Suicide :
హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్యకు పాల్పడ్డ మృగాడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ తర్వాత చాకచక్యంగా ఇంటి నుంచి తప్పించుకున్న రాజు.. తెలంగాణ పోలీసులకు చిక్కకుండా తనదైన శైలి ఒడుపుతో తప్పించుకుని తిరిగాడు. హత్యాచారానికి పాల్పడ్డానని, తన పశు వైఖరి కారణంగా తన కళ్లెదుటే తిరుగాడిన చిన్నారి చనిపోయిందన్న బాధ ఏమాత్రం లేకుండానే రాజు వ్యవహరించాడు. చేతిలో ఉన్న చిన్నపాటి నగదుతో ఎంతో దూరం వెళ్లలేనని అనుకున్నాడో, లేదంటే వేలాది మంది పోలీసులు వేటాడుతూ ఉంటే.. తానెలా తప్పించుకుంటానని భావించాడో తెలియదు గానీ.. బుధవారం రాత్రో, లేదంటే గురువారం తెల్లవారుజామునో అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్- వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజారాం వద్ద అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులపై సర్వత్రా ఆగ్రహం
చిన్నారిపై హత్యాచారం, నేరగాడిని పోలీసులు పట్టుకోలేకపోయిన వైనంపై గడచిన రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కాస్తంత లేటుగా అయినా సీరియస్ గానే స్పందించిన సీఎం కేసీఆర్.. నిందితుడిని తక్షణమే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలంటూ హోం మంత్రి మహమూద్ అలీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన అలీ.. బుధవారం డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ తదితర పోలీసు బాసులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అదే సమయంలో నగర పోలీసులతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు కూడా రాజు కోసం వేట మొదలెట్టారు. మొత్తంగా 3 వేల మంది పోలీసులు రాజు కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. దీంతో మరికొద్ది గంటల్లోనే రాజు పట్టుబడటం ఖాయమేనని అంతా అనుకున్నారు. అయితే పోలీసులకు పట్టుబడి చిత్రహింసలకు గురయ్యే కంటే.. ఆత్మహత్య చేసుకుంటే బెటరన్న భావనతో రాజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
రైలుపట్టాలపై రాజు డెడ్ బాడీ..
ఘట్ కేసర్-వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజారాం వద్ద ఓ యువకుడి మృతదేహం ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. చనిపోయిన యువకుడు రాజు మాదిరే ఉండటంతో.. అతడేనని గుర్తించేందుకు పోలీసులు పరిశీలన మొదలెట్టారు. ఈ క్రమంలో రాజు చేతిపై ఉన్న ఓ టాటూ ఆధారంగానే.. ఆ డెడ్ బాడీ రాజుదేనని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా రాజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు.
Must Read ;- అత్యాచారాంధ్రగా ఏపీ.. గుంటూరులో మరో దారుణం