ఆ మధ్య తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘రఘువరన్ బీటెక్’ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ధనుశ్ ను సవాల్ చేసి, అతని ఎదుగుదలను అడ్డుకునే విలన్ పాత్రలో ఓ కొత్త కుర్రాడు కనిపించాడు. ఆ యువకుడి పేరే ‘అమితాశ్’. ఈ అబ్బాయి ఎవరో కాదు .. చాలాకాలం క్రితం ‘సప్తపది’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గిరీశ్ ప్రధాన్ తనయుడు. తాజాగా గిరీశ్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ, తన తనయుడు తెరకి పరిచయమైన తీరును గురించి చెప్పుకొచ్చారు.
*”కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ .. మా అబ్బాయి అమితాశ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అలాగే ధనుశ్ .. అనిరుధ్ కూడా మంచి స్నేహితులు. అనిరుధ్ సిస్టర్ పెళ్లికి అమితాశ్ వెళ్లాడు .. ఆ ఫంక్షన్ కి ధనుశ్ కూడా రావడం జరిగింది. అక్కడే ధనుశ్ .. అమితాశ్ ను చూడటం జరిగింది. ‘రఘువరన్ బీటెక్’ సినిమా షూటింగును స్టార్ చేస్తున్నట్టు ఆ సందర్భంలోనే ధనుశ్ చెప్పాడు. ఆ సినిమాలో విలన్ గా చేస్తావా అని ధనుశ్ అడిగాడట. ఈ విషయం తెలిసి నేను ఆలోచనలో పడ్డాను.
*అమితాశ్ ను విలన్ గా పరిచయం చేయడం ఎంతవరకూ కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. అదే అభిప్రాయాన్ని నేను ధనుశ్ దగ్గర వ్యక్తం చేశాను. రజనీకాంత్ గారు కూడా తొలినాళ్లలో విలన్ గానే చేసినట్టు ఆయన నాతో అన్నారు. దాంతో నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. ఆ సినిమా అమితాశ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది” అని చెప్పుకొచ్చారు.
*ఆ తరువాత ఆయన ‘సప్తపది‘ సినిమా షూటింగును గురించి ప్రస్తావించారు. “ఈ సినిమా షూటింగు సమయంలో విశ్వనాథ్ గారు .. సబితగారిని చిన్నపిల్ల మాదిరిగానే ట్రీట్ చేస్తూ .. బుజ్జగిస్తూ ఆ పాత్రను చేయించుకున్నారు. తను అనుకున్నట్టుగా చేయకపోతే విశ్వనాథ్ గారు మాపై కోప్పడేవారు కాదు .. ఒక లుక్ ఇచ్చేవారు అంతే. ఆ సినిమా చేసినందుకు పారితోషికంగా నాకు ఆయన 5000 ఇచ్చారు. నేను అందుకున్న తొలి పారితోషికం అదే. అయితే ఈ సినిమాను పారితోషికంతో తూచలేము. ఈ సినిమా చేసి నలభై ఏళ్ళు అవుతున్నా, ఆ గుర్తింపు ఇప్పటికీ లభిస్తూనే వుంది. ఇంతటి గుర్తింపుకు కారకులైన విశ్వనాథ్ గారికి మేము ఎప్పుడూ రుణపడే ఉంటాము” అని అన్నారు.
Must Read ;- మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తోన్న ధనుష్