స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజుల కిందట శ్రీనివాసరెడ్డి, తన భార్య పుష్పవతితో టీడీపీ బలపరిచిన గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. ఆ తరవాత ఆయన కిడ్నాప్కు గురయ్యారు. మీడియాలో రచ్చకావడంతో మత్తుమందు ఇచ్చి చేతులు కాళ్లు కట్టేసి శ్రీనివాసరెడ్డిని పొలంలో వదిలేశారు. తాజాగా నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ శ్రీనివాసరెడ్డిపై వైసీపీ నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. దీంతో వేధింపులు భరించలేకే శ్రీనివాసరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల ఒత్తిడే కారణమా?
కిడ్నాప్ వ్యవహారంపై శ్రీనివాసరెడ్డి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇవాళ శ్రీనివాసరెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించారు. విచారణ అనంతరం మధ్యాహ్నం పొలంలో ఉరి వేసుకుని శ్రీనివాసరెడ్డి మృతి చెందడం కలకలం రేపుతోంది. నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైసీపీ నేతలు బెదిరించడంతో పాటు, పోలీసులు కూడా బెదిరించి ఉండవచ్చని, అందుకే శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత నెల టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ సమక్షంలో శ్రీనివాసరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేక, వైసీపీ శ్రేణుల బెదిరింపుల వల్లే శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Must Read ;- గొల్లలగుంట సందర్శించిన ఎస్ఈసీ, కలెక్టర్, ఎస్పీ