బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి యాంజియోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించారు. పూడుకుపోయిన గుండె రక్తనాళాల్లో మరో రెండు స్టెంట్లను అమర్చామని అపోలో ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం… దాదా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘గంగూలీ గుండెరక్తనాళాల్లో పూడికలు తొలగించేందుకు రెండు స్టెంట్లు అమర్చామని వివరించారు.
దాదా రెండోసారి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో బుధవారం కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. వైద్య బృందం సుధీర్ఘంగా చర్చించింది. దాదాకు మరో స్టెంట్లు వేయాలని నిర్ణయించింది.
జనవరి మొదటి వారంలో గంగూలీ గుండెనొప్పితో మొదటిసారిగా ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సమస్య తీవ్రతను బట్టి ఒక స్టెంట్ వేశారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో మిగతా చోట్ల స్టెంట్ వేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కాస్త అసౌకర్యంగా ఉండటంతో బుధవారం దాదా మరోసారి ఆస్పత్రిలో చేరారు.
మమత పరామర్శ…
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని పరామర్శించారు. దాదా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గంగూలీకి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయిందని చెప్పారు. అతని భార్య డోనా గంగూలీతో ఈ విషయం మాట్లాడినట్లు మమత మీడియాకు వివరించారు. ఆమె వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు.
Must Read ;- దాదా సేఫ్, కానీ, మరో స్టెంట్ పడాల్సిందే!











