టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ప్రత్యేకంగా కనిపిస్తాడు. మంచి హైటూ పర్సనాలిటీతో, మాస్ ఆడియన్స్ మెచ్చే లక్షణాలతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఒకవైపున తెలుగు సినిమాలు చేస్తూనే, మరో వైపున తమిళ సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. అందువలన ఈ రెండు చోట్లా ఆయనకి మంచి మార్కెట్ ఉంది. కొత్త కాన్సెప్టులు చేయడానికీ .. తన ఈడు హీరోలతో కలిసి నటించడానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపుతుంటాడు.ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‘ .. ‘బీరువా’ .. ‘నిను వీడని నీడను నేను’ వైవిధ్యభరితమైనవిగా నిలిచాయి.
సందీప్ కిషన్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘A1 ఎక్స్ ప్రెస్’ ముస్తాబవుతూ ఉండగా, ఆయన కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా వేదవ్యాస్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాలకు బాధ్యతలను అప్పగించారు. వైజాగ్ లో పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది. మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
కెరియర్ తొలి రోజుల నుంచి సందీప్ కిషన్ విభిన్నమైన పాత్రలనే చేస్తూ వస్తున్నాడు. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి ఇప్పుడు చేయనున్న పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అంటున్నారు. కథానాయిక .. ప్రతినాయకుడితో పాటు ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందట. త్వరలోనే ఆ విషయాలను తెలియపరుస్తామని అంటున్నారు. ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సందీప్ కిషన్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందన్నది చూడాలి.
Must Read ;- ట్రైలర్ టాక్ : క్రీడా రాజకీయంపై ఓ యువకుని పోరాటం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’