పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలన్నీ సీఎం జగన్ రెడ్డి చేసిన హత్యలేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న మద్యం నాణ్యతపైనా పరీక్షలు జరపాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందంటూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. సచివాలయం ఆవరణలోని అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ శాసనసభ పక్షం నాయకులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లు లభిస్తున్నాయంటూ మద్యం సీసాలతో అసెంబ్లీకి వచ్చారు.
అయితే సారా మరణాలన్నీ జగన్ రెడ్డి సర్కారు చేసిన హత్యలేనని ఆరోపించిన నారా లోకేష్, రెండు రోజుల్లో 15 మంది మృత్యువాత పడితే వైసీపీ ప్రభుత్వం కానీ, సంబంధిత మంత్రికానీ, అధికారి కానీ కనీసం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. జగన్ రెడ్డి తన సొంత బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, సెలెబ్రిటీ వంటి చౌక మద్యాన్ని అధికధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని, పేదలు ఈ మద్యం కొనలేక సారా తాగి మృత్యువాత పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో సారా తాగి 15 మంది మృత్యువాత పడటం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు.ఈ మరణాలపై న్యాయవిచారణ చేయాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 25 లక్షల పరిహారం ఇవ్వాలని, సారా కట్టడికి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న మద్యం నాణ్యతపైనా పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సారా తాగి మృతి చెందేవారి సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఈ సందర్భంగా లోకేష్ ఆరోపించారు.
Must Read:-ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!