ఆగస్టు 15.. ఏటా భారత్ కు పండుగే. ఆంగ్లేయుల కబంద హస్తాల నుంచి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజు. ఈ సందర్భంగా ఏటా దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు కులం, మతం, వర్గం, ప్రాంతం అన్న బేధాలే లేకుండా జరుగుతున్న తీరు అబ్బురపరచేదే. ఈ వేడుకల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమదైన శైలిలో సరికొత్తగా దేశ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తున్నాయి. వేడుకలన్నీ అచంచల దేశభక్తితో జరుగుతున్నా.. ఎక్కడికక్కడ ఏటికేడు ఏదో కొత్త వింత కనబడుతూనే ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంట జరిగిన వేడుకల్లో కూడా కనిపించింది.
వేడుకగా జెండా ఆవిష్కరణలు
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత చంద్రబాబు రెండు రాష్ట్రాల్లోనూ పర్యటించాల్సి వస్తోంది. హైదరాబాద్ లో తన నివాసం ఉండగా.. అమరావతిలోనే అధిక సమయం ఉంటూ వస్తున్నారు. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం తన కుటుంబం హైదరాబాద్ లో ఉంటుండగా.. చంద్రబాబు సహా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన కుమారుడు నారా లోకేశ్ లు..నిత్యం ఏపీకి వెళ్లి వస్తూనే ఉన్నారు. సెలవు దినాల్లో మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవాన సెలవే కాబట్టి చంద్రబాబు శనివారమే హైదరాబాద్ వచ్చారు.
చంద్రబాబు ఇంట ప్రత్యేకం
ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించగా.. తెలంగాణ శాఖకు సంబంధించి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. చంద్రబాబు మాత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి ఆవరణలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వేదిక మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్, ఆయన మనవడు నారా దేవాన్ష్ కూడా పాలుపంచుకున్నారు. వెరసి మువ్వన్నెల జెండాకు చంద్రబాబు ఇంట మూడు తరాలు వందనం పలికినట్టైంది.
Must Read ;- బాబు సత్తా ఇది!.. ఎనీ బడీ కేన్ చెక్!