అసలే కల్వకుంట్ల కవితకు చాలా కాలం పాటు పదవి లేదు. ఎలాగోలా కిందా మీదా పడిన టీఆర్ఎస్ అధిష్ఠానం ఆమెను శాసన మండలికి పంపగలిగింది. ఇది జరిగి అప్పుడే ఏడాది దాటిపోయింది. ఎమ్మెల్సీ దక్కింది కదా.. ఇక మినిస్ట్రీ కూడా గ్యారెంటీనే అని ఆమె నమ్మింది. అయితే ఆమె తండ్రి, పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా ఆమెకు కేబినెట్లో ఎంట్రీ ఇవ్వలేదు. ఈ జాప్యంపై కవిత చాలాకాలంగానే ఆగ్రహంతో ఉన్నట్టున్నారు. అయితే సీఎం కుర్చీలో ఉన్నది తండ్రి, కీలక మంత్రిగా ఉన్నది సోదరుడు కేటీఆరాయే. మింగలేక, కక్కలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జనం మధ్యకు కూడా రాకుండానే తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా కేసీఆర్ కూతురు మనసును అర్థం చేసుకోలేదో, లేదంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు గానీ.. కూతురు కోరికను నెరవేర్చడంలో జాప్యం చేస్తూనే ఉన్నారు. ఇలాగైతే లాభం లేదనుకున్నారో, ఏమో గానీ.. తండ్రి నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కూతురు ఆగ్రహిస్తే గానీ.. కేసీఆర్ కు విషయం అర్థమైనట్లు లేదు. కూతురు ఆగ్రహించిన 24 గంటల్లోనే ఆమె అడిగిన మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
విషయం ఏమిటంటే..?
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ కార్యాయాలు, మండల పరిషత్ కార్యాలయాలు, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సరైన సౌకర్యాలు లేవంటూ సోమవారం నాటి శాసన మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ హోదాలో కవిత తనదైన శైలిలో కేసీఆర్ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. కనీస సౌకర్యాలు లేకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పనిచేసేదెలా? అంటూ కవిత.. సభలోనే ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నిలదీశారు. ఓ వైపున సౌకర్యాలు లేకుండా, మరోవైపున అరకొర గౌరవ వేతనాలతో స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు ఏ మేర పనిచేస్తారంటూ కూడా కవిత ప్రశ్నించారు. స్వయంగా సీఎం కూతురు నోట నుంచే ఇలాంటి మాటలు వినిపించడంతో అటు విపక్షాలతో పాటు ఇటు అధికార పక్షం కూడా ఆశ్చర్యానికి గురైంది. ఇదే విషయాన్ని ఎర్రబెల్లి.. నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే.. పరిస్థితి మరింత విషమించే ప్రమాదం లేకపోలేదని కూడా కేసీఆర్ కు ఎర్రబెల్లి చెప్పారట.
24 గంటల్లోనే సమస్య పరిష్కారం
ఎర్రబెల్లి చెప్పిన విషయాన్ని సావదానంగా విన్న కేసీఆర్.. వెనువెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనాలను ఒకేసారి 30 శాతం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం నుంచి అందిన ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాలను పెంచుతూ మంగళవారం మధ్యాహ్నమే ఉత్తర్వులు జారీ చేశారు. అంటే.. కవిత గొంతు విప్పిన 24 గంటల్లోగానే.. కేసీఆర్ సర్కారు స్థానిక ప్రజా ప్రతినిధుల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్న మాట. ఇదేదో బాగున్నట్టుందే అని మిగిలిన శాఖల సిబ్బంది నేరుగా కవిత వద్దకెళ్లి తమ సమస్యలు విన్నవిస్తే.. వాటిపై కవిత గళం విప్పితే.. వాటిని కేసీఆర్ సర్కారు వెనువెంటనే పరిష్కరించేస్తుందన్న వాదనలు ఇప్పుడు తెలంగాణలో వైరల్ గా మారాయి.
Must Read ;- మోగిన ఎన్నికల నగారా!