తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి క్షత్రియులకు దక్కనుందా? అవునే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజుపై సీఐడీ రాజద్రోహం కేసులు పెట్టడం, కస్టడీలో ఎంపీ అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న కొద్ది మంది క్షత్రియులే కాదు, దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న క్షత్రియులంతా ఏకమవుతున్నారు. ఎంపీ రఘురామరాజు బెయిల్పై విడుదలై ఢిల్లీ వెళ్లిన తరవాత, దేశంలోని అందరు ఎంపీలకు వారి వారి భాషల్లో లేఖలు రాయడం, ఆయనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఎంపీలు రఘురామరాజుకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత వసుంధరా రాజే కూడా రఘురామరాజుకు అండగా నిలిచారు. అనేక రాష్ట్రాల ఎంపీలు కూడా ఆయనకు జరిగిన అన్యాయంపై స్పందించారు. వచ్చే నెలలో పార్లమెంటు సమావేశాలు జరిగితే రాజద్రోహం సెక్షన్లు, ఎంపీ రఘురామరాజుకు జరిగిన అన్యాయంపై చర్చించే అవకాశం లేకపోలేదు.
టీటీడీ కొత్త ఛైర్మన్ ఎవరు?
టీటీడీకి ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఒంగోలు ఎంపీగా కూడా పని చేశారు. టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరి ఒంగోలు టికెట్ తెచ్చుకోవడంతో, అప్పట్లో సుబ్బారెడ్డికి వైసీపీ అధినేత టీటీడీ ఛైర్మన్ పదవి హామీ ఇచ్చారు. అందులో భాగంగా అధికారంలోకి రాగానే సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ చేశారు. ఆయన పదవీ కాలం కొద్ది రోజుల్లోనే ముగియనుంది. మరోసారి టీటీడీ పదవి కోరుకుంటున్న సుబ్బారెడ్డి, కుదరకపోతే రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేతను కోరినట్టు తెలుస్తోంది. అయితే టీటీడీలో రెండు సార్లు వరుసగా ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు లేవు. తాజాగా ఎంపీ రఘురామరాజుపై ప్రభుత్వం సీఐడీతో దాడి చేయించిందని ఆ సామాజికవర్గం రగిలిపోతోందని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. వారిని కొంచెం శాంతింప జేయాలంటే క్షత్రియ కులస్థుడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టే అంశాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి సీరియస్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- జగన్కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?
గోకరాజు గంగరాజుకు ఛాన్స్
ఎంపీ రఘురామరాజు వైసీపీపై ఎప్పుడైతే తిరుగుబాటు జెండా ఎగురవేశారో, ఆ వెంటనే నరసాపురం టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన గోకరాజు గంగరాజును వైసీపీలో చేర్చుకున్నారు. నరసాపురం వైసీపీ బాధ్యతలు కూడా అప్పగించారు. రఘురామరాజు లేని లోటు తీర్చే విధంగా గంగరాజుకు వైసీపీ కండువా కప్పారు. తాజాగా రఘురామరాజు ఘటనలో క్షత్రియ కులస్థులు కోపంగా ఉన్నారని, వారిని శాంతింప జేయాలంటే అదే కులానికి చెందిన వ్యక్తికి టీటీడీ పదవి ఇచ్చి వారిని దారిలోకి తెచ్చుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే గోకరాజు గంగరాజుకు టీటీడీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్షత్రియులకు టీటీడీ పదవి కట్టబెట్టడం ద్వారా రఘురామరాజు ఘటన ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.
టీటీడీ ఛైర్మన్ రేసులో మరికొందరు..
టీటీడీ ఛైర్మన్ పదవి రేసులో మరో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గత ఎన్నికల్లో రాజంపేట టికెట్ ఇవ్వలేకపోయారు. అధికారంలోకి వచ్చాక అతనికి టీటీడీ ఛైర్మన్ పదవి ఆపర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సమీకరణల్లో క్షత్రియులు తెరమీదకు వచ్చారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సుబ్బారెడ్డి పదవిలో ఉన్నారు. వెంటనే మరలా మరో రెడ్డిని టీటీడీ ఛైర్మన్ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఇక బీసీ కులాలకు ఇస్తే గుంటూరు జిల్లాకు చెందిన ఓ బీసీ నేత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి కూడా కొందరు వైసీపీ నేతలు కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ జరగనుంది. సమీకరణాల్లో ఎవరికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుంది. మరెవరికి రాజ్యసభ దక్కుతుందో వేచిచూడాల్సిందే.
Must Read ;- ప్రోటోకాల్కూ రాజకీయ ప్రభావమా?.. నిస్సిగ్గు అపచారమా?