ఈ వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కే-కొత్త పలుకు ఏబీఎన్ రాధాకృష్ణ ఏపీ కేంద్రంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు మరికొన్ని కోణాలను లేవనెత్తారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధిల్లీ పర్యటన, బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా సీఎం కావాలనుకోవడం, గతంలో అప్పటి సీఎం చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ డీల్కు యత్నించడం, రాహుల్ గాంధీకి పని చేస్తానని తాజాగా పీకే చెప్పడం, నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో రాజుల వర్గంలో నెలకొన్న అభిప్రాయం-రాజుల సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించనున్న వ్యూహం, ఆనందయ్య మూలికా ఔషధం తదితర అంశాలను ప్రస్తావించారు. వాటిని పరిశీలిస్తే..
పీకే సెంటిమెంట్ల విషాన్ని ఎక్కించే కార్యక్రమం..
‘ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం పొందుతున్న పీకే ఇటీవల రాహుల్ గాంధీ కోసం పని చేస్తానని చెప్పినట్టు గుర్తు. అదే సమయంలో ప్రధాని మోదీకే పనిచేయాలని పలువురు కోరారు. తలలు పండిన రాజకీయ వ్యూహకర్తలు కూడా పీకే సహకారం కోరుతున్నారు. సిద్ధాంతాలు, అనుభవం, అభివృద్ధి కంటే పీకే వ్యూహాలే పని చేస్తున్నాయి. 2014లో బీజేపీ, 2019లో ఏపీలో వైఎస్ జగన్, మమతా బెనర్జీ, స్టాలిన్ తదితరులు అధికారాన్ని చేపట్టేందుకు పీకే వ్యూహాలు ఉన్నాయి. అయితే పీకే వ్యూహాలెలా ఉంటాయో అందరికీ తెలుసు. ప్రజలను తమకు తాముగా ఆలోచించుకునే అవకాశం లేకుండా సెంటిమెంట్ల విషాన్ని ఎక్కించే కార్యక్రమం జరుగుతుంది. మతం, కులం, సామాజిక వర్గం, ప్రాంతీయ వాదం లాంటి అంశాలే పని చేస్తాయి. 2014లో మతం, 2019ఏపీ ఎన్నికల్లో కులం తెరపైకి తెచ్చారు. అయితే పీకే వ్యూహం ఫలించి వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజాధనాన్ని పంచిపెట్టే మోడల్ను అమలు చేయడం ద్వారా బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజల్లో చాలా మంది తమకు ఇవ్వాల్సింది ఇస్తున్నాడుగా అనే ఆలోచించడం కూడా జరుగుతోంది. నిజానికి పీకే జగన్ రెడ్డికి పనిచేసేందుకు రెఢీ కాకంటే ముందే అప్పటి సీఎం చంద్రబాబును సంప్రదించారు. అయితే అందుకు రూ.350కోట్లు అవుతుందని చెప్పడంతో చంద్రబాబు వద్దనుకున్నారు. తరువాత పీకే వైఎస్ జగన్ రెడ్డికి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. తమ వ్యూహాల్లో భాగంగా ప్రజలను సొంతంగా ఆలోచించలేని స్థితిలోకి నెట్టి హిస్టీరిక్ సైకాలజీ ద్వారా తన క్లయింట్కు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసి దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయాలను భ్రష్ర్టు పట్టించారు. ఈ క్రమంలో పార్టీలు సిద్ధాంతాలు మర్చిపోయే పరిస్థితికి తెచ్చారు. ప్రజాపోరాటాల ద్వారా అధికారంలోకి రావచ్చనే విధానానికి పార్టీలు స్వస్తిపలికే స్థితికి తెచ్చారు. పెళ్లిళ్లు, పేరంటాలకు ఈవెంట్ మేనేజర్ల తరహాలో ఎన్నికల సమయంలో పీకేలాంటి వారిని నియమించుకుంటే సరిపోతుందనే భావనకు పార్టీలు వచ్చాయి.
గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో ఫార్ములా వన్ అధినేత ఒకరు విజయమాల్యా విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారట. విజయమాల్యా సీఎంగాని, పీఎంగాని అవుతారా అని అడిగారట. విజయమాల్యాకు సీఎం అవ్వాలని ఉండేది. అయితే చంద్రబాబు అలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారట. అప్పటికి విజయ్ మాల్యా లాంటి వారికి పీకేలాంటి వ్యూహకర్తలు దొరకలేదు. అలాంటి ఆలోచన రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే విజయమాల్యా ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో అయ్యేవారని అభిప్రాయపడేవారూ ఉన్నారు. కేసులు ఉండేవి కాదు.. ఒక వేళ కేసులున్నా జైలు నుంచి పాలించేవారేమో.
Also Read ;- కష్టపడిందంతా చంద్రబాబు.. కియా క్రెడిట్ తమదేనంటూ వైసీపీ మంత్రి కలరింగ్
ఏపీలో అడ్డగోలు సంక్షేమం
ఇక రాష్ట్రాలు బాగుపడితే విలువలు, సిద్ధాంతాలు పక్కన బెట్టవచ్చు. కాని ఏపీలో జరుగుతున్నదేంటి. స్వాతంత్రం వచ్చి 70ఏళ్లు దాటాక కూడా దేశంలో దారిద్య్రం పెరిగిపోయేట్టుగా అడ్డగోలు సంక్షేమం అమలవుతోంది. దక్షిణాదిలో మొదలైన ఈ కల్చర్ ఉత్తరాదికీ పాకింది. అప్పు చేసి పప్పు కూడు పెడుతూ సొంత సొమ్ము దానం చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో అమలైన మజ్జిగ మీకు.. మీగడ మాకు అన్న సిద్ధాంతాన్ని జగన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి వాటి మాటున ఏం చేశారో అందుకు జగన్ ఎందుర్కొంటున్న కేసులే సాక్ష్యం. 2004కు ముందు రూ.2 కోట్ల కోసం ఇంటిని తాకట్టుపెట్టే పరిస్థితిలో ఉన్నవారు ఇప్పుడు వేల కోట్ల వ్యాపారానికి ఎదిగిరాంటే ఇంకా అర్థం కాలేదా. అంతేకాదు..ఎవరికైనా అపరమిత ఆదాయం ఉన్నప్పుడు పరివర్తన, ఉదారత వస్తుంది. అయితే జగన్రెడ్డిలో అది లేదు. అవినీతి మరింత పెరిగింది. లిక్కర్ విషయంలో ఏపీలో జరుగుతున్న తంతును చూసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి వారు ఆ వ్యాపారానికి స్వస్తి చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా బలంగా ఉంటుంది. అయితే ఏపీలో అది లేకపోగా ఎవరో కన్న బిడ్డలను మరెవరో తమ బిడ్డలుగా సొంతం చేసుకున్నట్లుగా కంపెనీల యాజమాన్యాలు మారిపోతున్నాయి. సంక్షేమం మత్తులో ఉన్న ప్రజలకు ఇవేమీ పట్టడం లేదు. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేని స్థితికి ప్రజలను చేర్చారు. జగన్ సర్కారుకు అప్పుల పరిమితి అయిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై కన్నేశారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ అధీనంలోని ఆస్తులను దానికి బదిలీ చేసి వాటిని కుదువ పెట్టి అప్పు చేయబోతున్నారు. వైజాగ్లో ప్రభుత్వ ఆస్తులను ఈ సంస్థకు బదిలీ చేస్తున్నారు. రహదారులు, భవనాల శాఖకు చెందిన ఆస్తులను కూడా బదిలీ చేస్తున్న జగన్ సర్కారు రానున్న కాలంలో ఇంకేం ఆస్తులు బదిలీచేస్తారో తెలియదు. ప్రజలకు, కేంద్రానికి పట్టడం లేదు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రం చూసీ చూడనట్టు ఉంటోంది. అదే క్రమంలో జగన్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారు. మీడియా, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలను టార్గెట్ చేశారు. జగన్రెడ్డి పాలనో రెండేళ్లలో అప్పులు-సంక్షేమం తప్ప ఇంకేం కనిపించదు. ఎందుకు కూలుస్తాడో తెలియదు.. కట్టింది ఒక్కటి కూడా ఉండదు. రూ.కోట్ల ఫీజు చెల్లిస్తూ కేసులు వేస్తాడు. గెలిచిన కేసు ఒక్కటీ ఉండదు. ఎందుకు అప్పులు చేస్తాడో తెలియదు.. తీర్చే దారి మాత్రం కనపడదు. టెండర్లు ఎందుకు పిలుస్తారో తెలియదు. ఒక్కరు కూడా టెండర్లలో పాల్గొనరు’’ అన్నట్టుది. ఈ పరిణామాలను గమనిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం విశ్వసనీయత, పరపతి కోల్పోయిందనే అభిప్రాయం కూడా కలుగుతోంది.
రఘురామ వ్యవహారంలో దెబ్బతిన్న జగన్ ప్రతిష్ట
నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టడంతో జాతీయస్థాయిలో జగన్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతింది. ఇదంతా ఊహించని జగన్ రెడ్డి చివరికి జాతీయస్థాయిలో పలచన పడ్డారు. అదే సమయంలో రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఉత్తరాదిలోని రాజ్పుత్లూ జగన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిందని కూడా సమాచారం. దీంతో వైఎస్ జగన్ ఇప్పుడు రాజుల వర్గంలోని ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేశారు. టీటీడీ చైర్మన్ లాంటి పదవిని ఆ వర్గానికి కట్టబెట్టడం ద్వారా దగ్గర చేసుకోవాలని చూస్తునట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రం కోసమే వచ్చామని చెబుతారు. అయతే హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఏం జరిగి ఉంటుందనేది తెలిసేందుకు సమయం పడుతుంది. నిజానికి ప్రధాని మోదీ అనుమతి లేనిదే కేంద్ర మంత్రులు ఎవరూ వినతి పత్రాలపై చర్యలు తీసుకోరు. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే జరిగింది. చంద్రబాబు అయినా, జగన్ రెడ్డిలు ఎన్ని సార్లు ధిల్లీ వెళ్లినా నరేంద్ర మోదీ కరుణ లేకపోతే ఉపయోగం ఉండదు. ముఖ్యమంత్రి అయినా ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్రాన్ని అదడిగాం ..ఇదడిగాం అని చెప్పడం కామన్. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా అదే చేశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్రెడ్డి ఏం అడిగారో ఇప్పుడూ అదే అడిగారు. ప్రత్యేక హోదా విషయంలో చేతులెత్తేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, ఇవ్వజూపుతున్న ప్రత్యేక ప్యాకేజీనైనా అంగీకరించండి అని అప్పట్లో నేను పదే పదే చెప్పాను. చివరికి సంకుచిత రాజకీయాల పుణ్యమా అని ప్రత్యేక ప్యాకేజీ కూడా రాలేదు. అప్పట్లో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీతో ఉన్నారు. ఆయన కనీసం అదే ప్యాకేజీని ఇప్పిస్తే బాగుంటుంది. జగన్రెడ్డి రాజకీయ భవిష్యత్తు వ్యక్తిగత సమస్య. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమస్య. చివరికి కరోనాకు ఆనందయ్య ఇస్తున్న మూలికా ఔషధాన్ని కూడా వైసీపీ తన సొంతం అనేట్టు చూస్తున్నాం. ఉబ్బసం వ్యాధికి హైదరాబాద్లోని బత్తిన సోదరులు వేసే మందు విషయంలో ఏనాడూ ఏ ప్రభుత్వం తమదని చెప్పుకోలేదు. కాని ఏపీలో ప్రతిదీ వివాదమే అవుతోంది. అన్నింట్లో రాజకీయ లబ్ధి పొందాలన్న అధికార పార్టీ ఆరాటమే ఇందుకు కారణం. కనీసం పాలకులకు ఎబ్బెట్టుగా కూడా అనిపించడం లేదేమో. పీకే లాంటి వ్యూహకర్తల కృషి ఫలితంగా ఏర్పడే ప్రభుత్వాలలో హుందాతనాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా పంపకాలు చేస్తామని చెప్పి ప్రశాంత్ కిశోర్ను తలదన్నే వాడిని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఏపీ పరిస్థితి ఏంటి’ అని వ్యాఖ్యానించారు.
Must Read ;- చాయ్ వాలాను ఢీకొట్టే నాయకుడి అన్వేషణ.. మోదీ అంటేనే మండిపడుతున్న పీకే











