వారంతా పల్లె ప్రజలు .. వారి బ్యాంకు ఖాతాల్లో ఇబ్బడిముబ్బడిగా డబ్బు జమ అయింది .. ఒకరికి కాదు .. ఇద్దరికి కాదు .. ఏకంగా 200మందికి .. ఎవరు వేశారో .. ఎందుకు వేశారో .. వారికే కాదు .. అధికారులకూ తెలియడం లేదు .. ఆ గ్రామస్తులు వారి అకౌంట్ చూసి అవాక్కవుతున్నారు .. కొంతమంది పదిరోజుల ముందే పండుగ వచ్చిందని సంబరపడుతున్నారు .. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శివరాంపురం గ్రామంలో 607 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ గ్రామంలో వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న 200 మంది ఖాతాల్లో ఒకేసారి డబ్బులొచ్చి చేరాయి. ఎవరు వేశారో .. ఎందుకు వేశారో తెలియదు.. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు.. వెయ్యి, రెండు వేలు కాదు.. ఏకంగా రూ.13,500 నుంచి రూ.16 వేల మధ్య డబ్బులు జమయ్యాయి. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మండలానికి చెందిన ఏ ఒక్క అధికారి వద్ద జవాబు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రైతు భరోసా పథకానికి చెందిన డబ్బులు అనుకుందామంటే.. భూమి లేని వారికి కూడా నగదు జమ అయ్యింది. చాలా మంది ఖాతాదారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ ఖాతా వివరాలను తెలియజేయకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని లీడ్ బ్యాంక్ సహాయాధికారి మురళీ దృష్టికి మీడియా తీసుకువెళ్లగా.. ఇప్పటి వరకు ఈ అంశం తన దృష్టికి రాలేదన్నారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతా నంబరు ఆధార్తో లింక్ చేసి ఉన్నందున తప్పుగా డబ్బులు పడే అవకాశం లేదని, దీనిపై విచారణ చేస్తామన్నారు.
Must Read ;- వైసీపీ సర్కారు దగా.. పంటల బీమాలో పచ్చి మోసం!