నాగశౌర్య కథానాయకుడిగా ‘వరుడు కావలెను‘ సినిమా రూపొందుతోంది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాకి, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. నాగశౌర్య లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి.
యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాకథనాలతో రూపొందుతుండటం వలన, ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడిందట. చివరికి డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం వాళ్లు 6 కోట్లను చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా ఇది పెద్దమొత్తమేనని అంటున్నారు.
కొంతకాలంగా నాగశౌర్యకి హిట్ అనేది తెలియకుండా పోయింది. దాంతో ఆయన డీలాపడిపోకుండా మరింత పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు. అలా చేసిన ‘వరుడు కావలెను’ పై ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఇక ‘పెళ్లి చూపులు’ తరువాత రీతూ వర్మ కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆమెకి ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పాత్రలు మాత్రం పడలేదు. ఆమె కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఇక శర్వానంద్ .. నానీతో కలిసి ఆమె చేసిన సినిమాలు కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలతో ఆమె దశ తిరుగుతుందేమో చూడాలి మరి.
Must Read ;- దూకుడు మీదున్న నాగశౌర్య