What Is The Strategy Behind Kodali Nani’s Harsh Remarks On Chandrababu Naidu :
కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని)కి అసలు మంత్రి పదవి ఎలా దక్కిందన్న విషయంపై చాలా కాలం నుంచే పలు రకాల విశ్లేషణలు, ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై బూతులతో కూడిన విమర్శలు చేసేందుకే కొడాలికి జగన్ మంత్రి పదవి ఇచ్చారన్న భావన తెలిసిందే కదా. మంత్రి కాకముందు నుంచే చంద్రబాబు, లోకేశ్ లతో పాటు ఇతర టీడీపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన కారణంగానే కొడాలి నానికి జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, అంతేకాకుండా చంద్రబాబు అండ్ కోను ఆయన సామాజిక వర్గానికి చెందిన కొడాలితోనే తిట్టేస్తేనే మంచిదన్న భావనతో కూడా కొడాలికి జగన్ మంత్రి పదవి ఇచ్చారన్న వాదనలు ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథే అయినా.. ఇప్పుడు కొడాలి మరింతగా చంద్రబాబు, లోకేశ్ లపై తన స్థాయిని మరిచి మరింత పచ్చి బూతులు, ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనుక కొడాలి నాని వ్యూహం వేరేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బాబును అంతమొందించాలట
మంగళవారం నాడు తాడేపల్లిలో మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందని ఆయన అన్నారు. అలా జరిగి ఉంటే గుంటూరు లాంటి సంఘటనలు ఇప్పుడు జరిగేవి కాదని అన్నారు. ఎస్సీ మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్పైనా ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. విద్యా కానుక కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేశ్ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలన్నదే ప్రభుత్వం అభిమతమని, అందుకనే దిశ చట్టం, యాప్ను తీసుకొచ్చినట్టు చెప్పారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారని మంత్రి తెలిపారు. ఇలా చంద్రబాబు, లోకేశ్ లపై నాని ఓ రేంజిలో ఫైరవ్వడమే కాకుండా ఏకంగా చంద్రబాబును అంతమొందించాలంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
వ్యూహం ఏమిటంటే..?
జగన్ తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్లకే పూర్తిగా పునర్వవస్థీకరిస్తానని, అందులో భాగంగా మెజారిటీ మంత్రులను కేబినెట్ నుంచి తొలగించి కొత్త వారికి అవకాశం కల్పిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేబినెట్ వయసు రెండున్నరేళ్లకు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్ కూడా రీ షఫిలింగ్ పై దృష్టి సారించారట. మొన్నటి కేబినెట్ మీటింగ్ లో పనితీరు సరిగా లేని మంత్రులను వేలెత్తి మరీ చూపుతూ జగన్ వార్నింగ్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో మంత్రులు అందరిలోనూ ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. పనితీరులో అంతగా రాణించలేకపోతున్న మంత్రులు అయితే ఏకంగా ఇక తమకు ఊస్టింగ్ తప్పదన్న భావనకు వచ్చేశారు. కొడాలి నాని కూడా పనితీరు సరిగా లేని మంత్రి కిందే జగన్ పరిగణిస్తున్నట్లుగా చెబుతున్నారు. తన శాఖ అయిన సివిల్ సప్లైస్ లో లెక్కలేనన్ని సమస్యలు రేకెత్తుతున్నా.. వాటి పరిష్కారంపై దృష్టి సారించలేకపోతున్న నాని.. ఆయా సమస్యలను మరింతగా జఠిలం చేస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. సన్న బియ్యం వ్యవహారంపై కొడాలి చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కారు పరువును ఎంతగా దిగజార్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన మంత్రి పదవిని కాపాడుకోవాలంటే కొడాలి నాని ఏం చేయాలి? పరుష పదజాలానికి, బూతులకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన తన నోటికి పని చెప్పాలి. ఈ భావనతోనే కొడాలి నాని అవసరం ఉన్నా.. అవసరం లేకపోయినా చంద్రబాబు, లోకేశ్ లపై విరుచుకుపడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యూహం కొడాలి నానికి కలిసి వస్తుందా? లేదంటే ఊస్టింగ్ తప్పదా? అన్నది తేలాలంటే ఇంకో రెండు, మూడు నెలలు ఆగాలి.
Must Read ;- జగన్ కు ‘మూడు’ పోయిందబ్బా!











