మా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అనేక అంశాలు కనిపిస్తున్నాయి. మంచు విష్ణు గెలవడం, ప్రకాష్ రాజ్ ప్యానల్ వెనకబడిపోవడం వెనక ఏంజరిగిందనేది అందరూ ఊహించిందే.
ఇది ప్రిస్టేజ్ ఇష్యూకు సంబంధించిన అంశం. మెగాస్టార్ మద్దతు ఇచ్చిన ప్యానల్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటిదాకా మెగాస్టార్ మద్దతు ఉన్నవారే గెలుపొందుతూ వచ్చారు. ఈసారి ఎన్నికలు జరుగుతాయని తెలిసిన వెంటనే ప్రకాష్ రాజ్ వెళ్లి మెగాస్టార్ చిరంజీవి మద్దతు కోరారు. చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ర రాజ్ కాకుండా ఉండి ఉంటే చిరంజీవి ప్యానల్ ముందు నిలిచేదేమో.
ప్రకాష్ రాజ్ పేరు బయటికి వచ్చిన వెంటనే మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. ముందుగా మోహన్ బాబు చిరంజీవిని అడిగి ఉంటే చిరు కూడా విష్ణు వైపే మెుగ్గుచూపేవారేమో. కానీ మోహన్ బాబు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఎక్కువ మందిని ఓటు వేయడానికి తీసుకురావడంలో ఆయన సఫలీ కృతమయ్యారు.
ఎక్కువ ఓట్లు పోలవడమే
మా ఎన్నికల్లో ఇన్ని ఓట్లు ఎప్పుడూ పోలవలేదు. ఇంతమంది ఉత్సాహంగా ఓట్లు వేయడానికి రావడం విష్ణు గెలుపునకు నాంది వేసిందని చెప్పాలి. అలాగే రెండో అంశం ప్రకాష్ రాజ్ లోకల్, నాన్ లోకల్ అంశం. చాలామంది సీనియర్ నటులకు ప్రకాష్ రాజ్ నిల్చోవడం ఇష్టం లేదు. అందువల్ల సీనియర్ నటులు మంచు విష్ణు వైపే నిలిచారు. మెగా సోదరుడు నాగబాబు అనేక వీడియో బైట్ల ద్వారా ఎన్ని విన్పపాలు చేసినా ఓటర్లలో మార్పు రాలేదు. విష్ణు విషయంలో ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది.
డబ్బు కూడా పనిచేసిందని కొందరు ఆరోపణలు చేయవచ్చు. అది ఎంతవరకు ప్రభావం చూపిందన్నది ఇప్పుడే చెప్పలేం. తను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడం చిరంజీవికి ఇబ్బందికరమే. సినిమా రంగంలో ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇది రుచించని వ్యక్తులు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. వారందరికీ ఇది సంతోషం కలిగించే విషయం. పైకి దీన్ని వ్యక్తం చేయకపోయినా వారి అంతర్గత అంశం మాత్రం ఇదేనని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
క్రాస్ ఓటింగు కూడా జరిగింది కాబట్టి కేవలం ప్రకాష్ రాజ్ మీద వ్యతిరేకత కూడా పనిచేసిందనుకోవాలి. ఒకప్పుడు దాసరి నారాయణరావు సినిమా రంగంలో పెద్దన్న పాత్ర పోషించారు కాబట్టి మోహన్ బాబుకు కూడా అలాంటి కోరిక ఏదైనా ఉందని అనుకోవాలా? లేదా సామాజిక సమీకరణలు ఏమైనా పనిచేశాయా? లాంటి అంశాలు కూడా తెరమీదకు వచ్చాయి. పోటీ విషయంలో ప్రకాష్ రాజ్ ముందే వెనక్కి తగ్గి ఉంటే బాగుండేది.
అనువుగాని చోట అధికులమనరాదు అనే అంశాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. అసలు అంత బిజీగా ఉండే ప్రకాష్ రాజ్ కు ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరముందా అన్న అంశం కూడా చాలామందిలో చర్చకు వచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున నిలబడిన ఈసీ మెంబర్లు గెలుపొందడం చిరంజీవికి కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. క్రాస్ ఓటింగుకు ఇది అద్దం పడుతోంది.
Must Read ;- మా ఎన్నికల్లో ఈసీ మెంబర్ల ఫలితాలు











