మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో చీలిక అనే దానికి ఫుల్ స్టాప్ పడినట్టే. అలాంటి ఆలోచన ఏదీ లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఆత్మ పేరుతో తాము వేరొక అసోసియేషన్ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కొంతమంది ఈ ప్రతిపాదన తెచ్చిన దీనివల్ల మరింత లోకువ అవుతారని శ్రేయోభిలాషులు చెప్పడంతో ఇలాంటి ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ వ్యక్తులు మాత్రం రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దీని మీద వారు ఓ లేఖను కూడా మా అధ్యక్షుడికి రాశారు. ఆ లేఖలో ఏముందో చూద్దాం. ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలంటే అందరి ఆలోచనలు, ఆచరణలు.. ఒకేలా ఉండటం అవసరం. అప్పుడే సంస్థ సజావుగా నడిచే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో నరేష్గారు ‘మా’ అధ్యక్షులుగా ఉన్న సమయంలో తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే అయ్యి, ‘మా’ కోసం ఏ పనీ జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారు. జరిగిన గొప్ప పనులపై కూడా బురద చల్లారు. ఇప్పుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతుందేమో అనే సంశయంతో ఉన్నాం. ఈసారి జరిగిన ఎలక్షన్స్లో విష్ణుగారి ప్యానల్ నుంచి కొందరు, ప్రకాష్ రాజ్గారి ప్యానల్ నుండి కొందరు గెలిచారు. మళ్లీ మాలో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది.
సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్తం ఉన్న మేము అడగకుండా ఉండలేము. అందుకని ‘మా’ సంస్థని విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశంతో, మేము ‘మా’ పదవులకు మనసా వాచా కర్మణా.. రిజైన్ చేస్తున్నాం. అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల భవిష్యత్తులో ‘మా’లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. మా అధ్యక్షుడిగా విష్ణుని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాశారు.
Must Read ;- ప్రకాష్ రాజ్ వర్గం రాజీనామా నిర్ణయం