తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. ఏపీలో వైసీపీ అధికార పార్టీగా కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కీలక పార్టీగా ఉన్న టీడీపీ మాత్రం విపక్షంలో కూర్చుంది. అధికారంలో ఉన్న పార్టీలకు విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అందిన విరాళాలను ఏమాత్రం ఖర్చు చేయకుండా ఇటు టీఆర్ఎస్, అటు వైసీపీ ఏటికేడు ఆదాయాన్ని దాచుకుంటూ తమ నిధులను అంతకంతకూ పెంచుకుంటూ ఉండగా.. విపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం నిధులు లేక.. ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువ కావడంతో నష్టాలతో సతమతమవుతోంది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా పార్టీలకు దక్కిన విరాళాలను పరిశీలిస్తే.. ఇదే విషయం బోధపడుతోంది.
అధికార పార్టీలకే విరాళాలు
వాస్తవంగా ధికారంలో ఉన్న పార్టీకి విరాళాలివ్వడానికి అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు కదా. ఈ మాట నిజమేనన్నట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎంతమేర విరాళాలైనా సేకరించేలా బీజేపీ ప్రభుత్వమే నూతన విధానాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎవరు ఇస్తున్నారో తెలియకపోయినా ఎన్ని కోట్లయినా విరాళాలు తీసుకోవచ్చు. ఈ విధానంతో బీజేపీ పెద్ద ఎత్తున విరాళాలను సేకరించింది. ప్రాంతీయపార్టీల్లో బీజేపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుని టాప్ పొజిషన్లో నిలిచింది. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక మొత్తం అందుకుంటున్న పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని ఈ పార్టీ పొందింది. ఇక ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కింది. రెండో స్థానంలో ఉన్న శివసేనకు రూ. 111.403కోట్ల విరాళాలొచ్చాయి. అదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ విరాళాలను ఇష్టారాజ్యంగా సేకరిస్తూ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. వైసీపీకి రూ. 92.739కోట్లు విరాళాలొచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447.49కోట్లు విరాళాలు అందాయి. 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.
ఆర్థిక లోటులో విపక్షాలు
అధికారంలో ఉన్న పార్టీలకు ఆదాయం వస్తున్నా.. దానిని ఆయా పార్టీలు వాటిని ఖర్చు చేయడం లేదు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ తనకు అందిన మొత్తం ఆదాయంలో 15 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. వైసీపీ పరిస్థితి కూడా అంతే. తనకు అందుతున్న విరాళాలను జగన్ పార్టీ ఏమాత్రం ఖర్చు చేయడం లేదు. వెరసి ఈ రెండు పార్టీల ఆదాయం అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మాత్రం విరాళాలు తగ్గిపోతున్నాయి. ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసి టీడీపీ ఇప్పటికే లోటులోకి వెళ్లిపోయింది. పార్టీ కార్యకర్తల సంక్షేమం, నిత్యం పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో టీడీపీకి ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయనే చెప్పాలి.
Must ReaD ;- టీడీపీ గెలుపు బాటకు పునాదులివే











