విశాఖలో లక్ష్మీ అపర్ణపై పోలీసులు వ్యవహరించిన తీరు, తదనంతరం ఆమెపై అక్రమ కేసులు పెట్టడంపై మహిళా సంఘాలు గళం విప్పాయి. అపర్ణకు మద్ధతుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తీరును జనం కూడా తప్పు పడుతున్నారు. అపర్ణపై దాడి చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చించేందుకు ఐద్వా ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించింది. లక్ష్మీ అపర్ణకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఆమెపై పెట్టిన అక్రమ కేసు బేషరతుగా ఎత్తి వేయాలని పలువురు మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
స్టేషన్కు తరలించడం చట్ట విరుద్దం
లక్ష్మీఅపర్ణ ఎలాంటి నేరం చేయకున్నా ఆమెను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయడం చట్ట విరుద్దమని మహిళా సంఘాలు తప్పుపడుతున్నాయి. పోలీసులు వారు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు అపర్ణపై మద్యం తాగిందనే ముద్ర వేస్తున్నారని పలువురు మహిళా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్యను పోలీసులు నానా రాద్దాతం చేస్తున్నారని, బెదిరింపులకు కూడా దిగుతున్నారని మహిళా సంఘాల నేతలు చెబుతున్నారు. విశాఖ ప్రజలంతా లక్ష్మీఅపర్ణకు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.అపర్ణపై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరును విజయవాడ బార్ అసోసియేషన్ కూడా ఖండించింది. పోలీసుల చర్య చట్ట విరుద్దమని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- ఫ్రెండ్లీ పోలీసింగ్ మరచి ప్రజలను వేధిస్తున్నారు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ