పేదవారికి ఏ ఆపద వచ్చినా కుయ్.. కుయ్.. మంటూ వచ్చి వాలేది 108 అంబులెన్సులే. ఆపదలో ఎవరున్నా 108కి కాల్ చేయడం సహజం. అయితే ఆపదలో ఉన్న వారి సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలా, ప్రైవేటుకా అనేది అంబులెన్సు సిబ్బంది నిర్ణయించుకోవాలి. బాధితులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించమంటేనే వారిని అక్కడకు తీసుకువెళ్లాలి. కానీ ఏపీలో వింత పోకడ నడుస్తోంది. ఎవరికి ఏ ఆపద వచ్చి ఫోన్ చేసినా పది నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్సులు, మరో పది నిమిషాల్లో బాధితుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. 108 సిబ్బంది, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కుమ్మక్కు కావడంతో ఈ వ్యవహారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది.
ఆరోగ్యశ్రీ పథకం కోసమే..
ఏపీలో కోటి 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంటే 108కి ఫోన్ చేసే బాధితుల్లో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటున్నాయి. వీరికి ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించాలి. అయితే ప్రతి నగరంలో 10 నుంచి 50 దాకా ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేటు ఆసుపత్రులు ఉంటున్నాయి. అయితే వైసీపీ నేతలు చెప్పిన ఆసుపత్రులకే అంబులెన్సులు పరుగులు పెడుతున్నాయి. అంబులెన్సు సిబ్బందికి కూడా ఏ కేసు తీసుకువస్తే ఎంత అనేది ముందే ఫిక్సు చేస్తున్నారు. దీంతో వారు కూడా ఉత్సాహంగా బాధితులను ముందుగానే కుమ్మక్కు అయిన ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
విజయవాడలో వెలుగు చూసిన అరాచకం
విజయవాడలో 108 సిబ్బంది, ప్రైవేటు ఆసుపత్రులు కుమ్మక్కయిన వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిలో తొలుత కృష్ణా జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ను విధుల నుంచి తప్పించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై డీహెచ్ఎంవో విచారణ ప్రారంభించారు. గత సంవత్సరకాలంగా ఈ తంతు జరుగుతున్నా, జిల్లా వైద్యాధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించారు. ప్రతి జిల్లాలో ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు కృష్ణా జిల్లాలో మాత్రమే విచారణకు ఆదేశించడంపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి.
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కాసులే కాసులు
ప్రభుత్వ అంబులెన్సులతో ప్రైవేటు ఆసుపత్రులు వ్యాపారం సాగిస్తున్నాయి. అంబులెన్సు సిబ్బందికి ఒక్కో కేసు తీసుకు వస్తే రూ.1500 నుంచి రూ.6000 దాకా కమీషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంటు కేసు తీసుకువస్తే అంబులెన్సు డ్రైవర్కు రూ.2వేలు, ఆరోగ్య సిబ్బందికి రూ.4000 వెంటనే చెల్లిస్తున్నారు. దీంతో ఫోన్ రావడం ఆలస్యం 108 అంబులెన్సుల సిబ్బంది వెంటనే వాలిపోతున్నారు. బాధితులను వారు కుమ్మక్కైన ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో విజయవాడ నగరంలో కొన్ని ఆసుపత్రులు కేవలం 108 అంబులెన్సుల ద్వారా వచ్చే బాధితులతోనే నిండిపోతున్నాయని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఇలాగే వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి 108 సిబ్బంది, ఆరోగ్యశ్రీ సిబ్బంది, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
Must Read ;- పాలనపై.. జగన్ చేయించుకున్న సర్వే ఏం చెప్తోంది..?











