సునామీ.. అప్పటివరకు ఎప్పుడూ వినని పేరు. సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి.. ఊళ్లను ముంచెత్తుతుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు. అది 2004.. డిసెంబరు 26.. ఉదయం 6 గంటలు. రాబోయే ఉప్పెనకు ముందు అంతటా ప్రశాంత వాతావరణం. జనం.. తమ దైనందిన కార్యక్రమాలను అప్పుడప్పుడే మొదలెడుతున్నారు. మత్సకారులు.. చేపల వేటకు బయలుదేరుతున్నారు. సాగరతీరంలో నడకను ఆస్వాదించే వారు.. బీచ్ల దిశగా కదులుతున్నారు. ఉద్యోగులు.. ఆఫీసులకు వెళ్లేందుకు తయారవుతున్నారు. వ్యాపారులు.. తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. బద్ధకస్తులు.. బెడ్డు మీద నుంచి లేవాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారు. పాపం.. వీరెవరికీ తెలియదు. కాసేపట్లో తమ తల రాత మారిపోబోతోందని. లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోబోతున్నాయని. పొట్ట చేతబట్టుకుని రోడ్డున పడాల్సి వస్తుందని. ప్రకృతి ఉగ్రరూపానికి తమ జీవితాలు తల్లకిందులు కాబోతున్నాయని. అందుకే.. కొన్ని గంటల్లో విరుచుకుపడబోయే విలయాన్ని ఊహించలేక.. తమ రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు.
ప్రకృతి ప్రకోపం..
ప్రకృతిని శాసిస్తున్నామని భావిస్తున్న మనం.. అది ఆగ్రహిస్తే.. దాని ముందు ఎంత అల్పులమో అర్థమైన క్షణమది. ఉదయం 7:58 గంటలు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సముద్రుడు.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసి.. తన అలలతో ఊళ్లను ముంచెత్తాడు. రాకాసి అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అసలు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోగానే.. క్షణాల వ్యవధిలో లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వచ్చింది సునామీ అని తెలియకుండానే దాదాపు 2,30,000 మంది విగతులయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కోట్లది మందికి తీరని వ్యధను మిగిల్చింది. వేలాది ఇళ్లు.. ఆనవాళ్లు కూడా మిగలకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక పశువులు, ఇతరత్రా జంతువులు లక్షల సంఖ్యలో జలసమాధయ్యాయి. ఇది.. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇండోనేషియా, శ్రీలంక, మాల్దీవులు, థాయ్ ల్యాండ్, భారత్ సహా 14 దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది.
ఏమిటీ సునామీ!
భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు.. బర్మా భూభాగానికి చెందిన టెక్టోనిక్ ప్లేట్లకు మధ్య రాపిడి జరగడం వల్ల హిందూ మహా సముద్ర గర్భంలో 9.3 తీవ్రతతో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో.. సముద్రపు అలలు ఒక్కసారిగా 30 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాలను ముంచెత్తాయి. సిస్మో గ్రాఫుపై రికార్డయిన మూడో అతిపెద్ద భూకంపం ఇది. ఎప్పుడూ లేని విధంగా భూమి.. 8.3 నుంచి 10 నిముషాల పాటు కంపించింది. దీంతో.. భూ గ్రహమే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. హిందూ మహాసముద్రంలోని సుమత్రా దీవులు, ఇండోనేషియా దక్షిణ తీరం వెంబడి ఏర్పడిన ఈ సునామీ ప్రభావం.. ఎక్కడో దూరాన ఉన్న అలస్కాలో కూడా కనిపించింది. యావత్ ప్రపంచాన్ని వణికించిన ఈ సునామీ విలయానికి నేటికి 16 ఏళ్లు.
Must Read ;- కష్టం వచ్చిందెప్పుడు..? కన్నీళ్లు తుడిచేదెప్పుడు?