రామాయణంలో- రావణ నిర్బంధంలో కష్టాల్లో ఉన్న సీతమ్మ మదిలో కూడా ఆత్మహత్య ఆలోచన ప్రవేశించింది. కానీ ఆమె దానిని తోసిపుచ్చి తన జీవితాన్ని నిలబెట్టుకుంది..
ఎలా జరిగిందది?
చిత్ర పాండ్యన్.. ఇవాళ దేశమంతా ఈమె గురించి మాట్లాడుకుంటోంది. అంత కష్టం ఆమెకు ఏమొచ్చింది? అని అనుకుంటోంది. వార్తల ద్వారా వెలుగులోకి వస్తున్న వివరాలను బట్టి.. ఆమె జీవితంలో అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి.. ఎక్కడా పెద్దగా తేడా కనిపించడం లేదు. కానీ.. హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరణంపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ, తమిళ టీవీ రంగాలకు చెందిన నటుల్లో, యాంకర్లలో.. తన ప్రతిభతో ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం నింపే మంచి పెర్ఫార్మర్గా గుర్తింపు ఉన్న చిత్ర పాండ్యన్ ఆత్మహత్య సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
ప్రతినిత్యం ఆత్మహత్యలు అనేకం జరుగుతుంటాయి. అప్పుల బాధ తాళలేని రైతు ఆత్మహత్యలు, అత్తింటి ఆరళ్లు ఓర్వలేని అతివల ఆత్మహత్యలు, చదువుల ఒత్తిళ్లు భరించలేని చిన్నారుల ఆత్మహత్యలు, ప్రేమను ఈడేర్చుకునే ధైర్యం లేని యువతరం ఆత్మహత్యలు మనకు సర్వసాధారణం. అయితే తమిళ వీజే చిత్రపాండ్యన్ ఆత్మహత్య వ్యవహారంలో ఇలాంటి కారణాలు ఏవీ మచ్చుకు కూడా కనిపించవు. స్థిమితమైన జీవితమే నడుస్తోంది. పాండ్యన్ స్టోర్స్ కార్యక్రమం ద్వారా ఆమెకు సెలబ్రిటీ స్థాయిలో పాపులారిటీ ఉంది. తాను కోరుకున్న వాడితో జనవరిలో వివాహం జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయింది. (వీరికి రిజిస్టరు మేరేజి అయిందనే వాదన కూడా వినిపిస్తోంది) షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి దగ్గర్లో ఇద్దరూ కలిసే హోటల్లో బస చేశారు. ఆ రాత్రి షూటింగ్ నుంచి తిరిగివచ్చిన తర్వాత.. ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ప్రతిరోజూ ఎన్ని వందల వేల ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ.. కొన్నే చర్చనీయాంశం అవుతుంటాయి. ఆయా రంగాలకు ఉండే పాపులారిటీని బట్టి.. ఆ రంగాల్లోని వారి ఆత్మహత్యల గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అందుకే ఒక రైతు ఆత్మహత్య కంటె- ఒక సినీ సెలబ్రిటీ ఆత్మహత్యకు క్రేజ్ ఎక్కువ. పైగా ఇటీవలి కాలంలో సినీ, టీవీ రంగంనుంచి ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి.
Must Read ;- చిత్రను భర్తే కొట్టి చంపాడంటున్న తల్లి
ఆశలు- వాస్తవాలకు వ్యత్యాసం ఎక్కువ!
భూమ్మీద ఏ రంగంలో అయినా ఆశలు- వాస్తవాలకు మధ్య వ్యత్యాసం ఎంతో కొంత ఉంటుంది. నేలమీద కాలు ఆన్చి, వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని తమ జీవితాన్ని దిద్దుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే సినిమా రంగం విషయానికి వస్తే.. ఈ వ్యత్యాసాలు కొంత ఎక్కువగా ఉంటాయి- దిద్దుకోగల ఓపిక ఉన్నవారు తక్కువగా ఉంటారు. నిన్నటిదాకా మన మధ్యనే ఉంటూ ఇరానీ కేఫ్ లో వన్ బై టూ చాయ్ తాగిన వాడు, ఉస్మానియా బిస్కట్ను మనతో చెరిసగం తుంచుకుని, పంచుకుని కడుపు నింపుకున్న వాడు.. తెల్లారేసరికి స్టార్ అయిపోతుంటాడు. అలా ఏదో ఒకరి విషయంలో, హఠాత్తుగా మారిపోయిన తలరాత– బోలెడు మందిలో ఆశలు పుట్టిస్తుంది. ‘ఏదో ఒక రోజున- మనం కూడా ఒక్కరోజులో స్టార్ అయిపోతాం’ అనుకుంటూ బతుకుతుంటారు. ఆ ‘ఒక్క రోజు’ కోసం ఎదురుచూస్తుంటారు! ఆ ఎదురుచూపు కొన్నేళ్లు, దశాబ్దాలు కూడా సాగుతుంటుంది. ‘ఆశ’ వారి జీవితాన్ని సాగదీస్తుంటుంది.. ‘వాస్తవం’ అర్థమైనప్పుడు తట్టుకోలేని వారు ఆత్మహత్యను ఆశ్రయిస్తారు. ఇదంతా ఒక రకం.
తమను తాము పురిగొల్పుకుని, పులిసవారీ చేసేవాళ్లు కొందరు ఉంటారు. ఇష్ట పూర్వకంగానే పులిని ఎక్కుతారు. సవారీలో అలిసిపోయిన తర్వాత గానీ.. దిగితే ఆ పులి తినేస్తుందనే వాస్తవం వారికి బోధపడదు. ఆ పులి కూడా తామే అయి- ఆత్మహత్య చేసుకుంటారు. ‘కెరీర్ కోసం’, ‘భవిష్యత్తుకోసం’ అనే ముసుగులో.. కొన్ని సందర్భాల్లో డబ్బుకోసం దారితప్పి ప్రవర్తించే వాళ్లు.. దారి తప్పిన బంధాలను కోరుకునే వాళ్లు.. ఒక హిపోక్రసీతో జీవితంలో మధురిమలను ఆస్వాదిస్తున్నట్లుగా భ్రమిస్తూ గడిపేవాళ్లు.. ఏదో ఒక నాటికి ఆశలకు- వాస్తవాలకు మధ్య వ్యత్యాసాన్ని భరించలేక చావును ఆశ్రయిస్తుంటారు. ఇది రెండో రకం.
మొన్నటి బాలీవుడ్ సుశాంత్ సింగ్, సమీర్ శర్మ విషయంలో అయినా, నిన్నటి టాలీవుడ్ శ్రావణి విషయమైనా, ఇవాళ్టి కోలీవుడ్ చిత్ర పాండ్యన్ అయినా, తమిళ పరిశ్రమలో అన్నా చెల్లెళ్లు శ్రీధర్, జయకల్యాణి అయినా అందరూ ఈ వర్గీకరణకే చెందుతారు.
Also Read ;- ప్రవాస ప్రేమ : ప్రణయ్ ఆత్మహత్యే చివరిది కావాలి !
చావును వరించి తెచ్చుకోవడమే..
జీవితంలో అన్నింటికంటె పెద్ద కష్టం ‘చావు’! ఈ స్పృహ ఉంటే ఏ మనిషినీ ఏ కష్టమూ పెద్దగా బాధించదు. అసలైన కష్టం- మనం అధిగమించగలిగేది కాదు. దాని ముందు ఏ కష్టం వచ్చినా- భయపడడంలో అర్థం లేదు. కానీ.. ఆశలను అందుకోవడానికి ఉండే దూరం ఒక స్థాయిని మించిపోయిన తర్వాత.. ఇక ఎప్పటికీ అందుకోలేమని భావించినప్పుడు జీవితం అక్కర్లేదని అనిపిస్తుంది. చావును కోరుకుంటారు. మనం కోరుకోగానే అది రాదు కదా! రామాయణం సుందరకాండలో ఒక శ్లోకం ఉంటుంది.
లోకప్రవాదో సత్యో2యం పండితై స్సముదాహృతః |
అకాలే దుర్లభో మృత్యుః స్ర్తియా వా పురుషస్య వా ||
‘ఆడవాళ్లయినా, మగాళ్లయినా.. ఎవ్వరికైనా సరే.. కోరుకున్నంత మాత్రాన అకాలంలో చావు రాదు- అన్నమాట నిజం’ అని ఈ శ్లోక భావం. మనం కోరుకుంటే చావు రాదు. కానీ బతుకు మీద ఇచ్ఛ పోయినప్పుడు ఆశ్రయించేదే ఈ బలవన్మరణం- ఆత్మహత్య! చావు వచ్చేదాకా ఆగలేని, అంతవరకు రాగల ప్రతికష్టాన్నీ గెలవగలమనే విశ్వాసం లేని.. వాళ్లు చేసే పని ఇది.
ఈ సత్యం తెలిస్తే ఆత్మహత్య చేసుకోరు..
సాధారణంగా కష్టాల్లో ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉన్నవారు.. సుందరకాండ పారాయణం చేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పద్యాలు చదవగానే మంచి జరిగిపోతుందా.. అనే సందేహం మనకు రావొచ్చు. ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇక్కడ ఒక కీలకమైన లాజిక్ ఉంది. సుందరకాండ మొత్తం సీతమ్మ కష్టాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. రామాయణంలో సీత పాత్రను గమనిస్తే ఆరేళ్ల వయసులో పెళ్లి చేసుకుంది.. పసివయసులో ఆ భోగం 12 ఏళ్లే! 18ఏళ్ల వయసులో భర్త వెంట వనవాసానికి వెళ్లింది. వనవాసం చివర్లో 10 నెలల పాటు రావణుడి చెరలో ఉంది. తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చింది. ఆ వెంటనే మళ్లీ రాముడు పరిత్యజించడంతో వాల్మీకి ఆశ్రమానికి వెళ్లి అక్కడో 12ఏళ్లు గడిపింది. జీవితమంతా కష్టాలే. ప్రత్యేకించి సుందరకాండ మొత్తం సీత కష్టాలే ప్రధానంగా వర్ణన ఉంటుంది. పైగా వాల్మీకి రామాయణంలో వర్ణనలు చాలా ఎక్కువగా ఉంటాయి. సీత కష్టాలను రకరకాలుగా వర్ణించి చెబుతాడు వాల్మీకి! ఇదంతా గమనించినప్పుడు.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సుందరకాండ చదివితే.. బహుశా మనం అనుభవిస్తున్న వాటికంటె పెద్ద పెద్ద కష్టాలు అందులో కనిపిస్తాయి. మనకు తెలియకుండానే ఆ కష్టాలతో పోల్చుకుని కొంత ఊరట పొందడం జరగొచ్చు. అందుకేనేమో సుందరకాండ చదివితే కష్టాలు తొలగుతాయంటారు.
ఇవాళ మన టీవీ యాంకర్లు, నటులు, సెలబ్రిటీలు, విద్యార్థులు, రైతులు, గృహిణులు కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మరి మనందరి ఎక్కువ కష్టాలు పడిందని మనం చెప్పుకుంటున్న సీతమ్మకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించలేదా? సీతకు కూడా ఆత్మహత్య ఆలోచన వచ్చింది!!
సీత ఆత్మహత్య ఆలోచన
వాల్మీకి వర్ణించిన మేరకు ఎద భాగం మొత్తం తడిచిపోయేంతగా సీత అశోకవనంలో ఏడుస్తూనే ఉంది. ఒకవైపు తనకు కాపలాగా ఉన్న ఆడరాక్షసుల బెదిరింపులు, రాముడు వచ్చి తనను తీసుకెళ్తాడనే నమ్మకం ఉన్నప్పటికీ.. అది ఎప్పటికి జరుగుతుందో ఈలోగా ఏమౌతుందో అనే భయం.. వెరసి ఆమెలో ఆత్మహత్య ఆలోచన ప్రవేశించింది. రామాయణం- సుందరకాండలో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఓ అద్భుతమైన శ్లోకం ఉంటుంది. అది చదివితే.. సారం బోధపడితే క్షణికావేశంలో తీవ్రమైన ఆ ఆలోచన చేసే ఎవ్వరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడరు!
ఇంతకూ ఆ శ్లోకం ఏంటంటే..
ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతామ్ |
న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మచ్ఛందేన జీవితమ్ ||
‘మనిషి జీవితం అంటేనే పాపాలను పుణ్యాలను విచక్షణతో చూడగలిగిన వివేకం గలది. అందువల్ల- ఆత్మ ధరించి ఉన్న ఈ జీవితాన్ని విడిచిపెట్టడం నాకు అసాధ్యం’ అని ఈ శ్లోక భావం. సింపుల్ గా మన మాటల్లో చెప్పుకోవాలంటే.. మంచి చెడుల విచక్షణ ఉండే మనిషిని గనుక.. నేను ఆత్మహత్య చేసుకోలేను అని సీతమ్మ అనుకున్నదట.!
మన వ్యక్తిత్వాన్ని నిండుగా తీర్చిదిద్దే.. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మహత్య ఆలోచన కూడా దరికి చేరనివ్వకుండా ఉండే స్థైర్యాన్నిచ్చే శ్లోకం ఇది. మనకు మాత్రమే మంచి చెడు తేడా తెలుసు.
మనుష్యత్వం అనేది పుణ్య పాప విచక్షణ చేసే వివేకం కలిగినది. అందువల్ల ఈ జీవితాన్ని త్యజించడానికి మనకు అవకాశం, అధికారం లేదని తెలుసుకోవాలి. జ్ఞానం, సంపద, స్థాయి హోదా వేటితోనూ నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిలో తగిన నిబ్బరం, ధైర్యం ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఇలాంటి విచక్షణ ఉండాలని, అది ఎప్పుడూ అదుపు తప్పకూడదని కోరుకుందాం.
.. సురేష్ పిళ్లె
Also Read ;- ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. నిరాకరించిందని యువతి గొంతు కోసిన ప్రియుడు











