తెలంగాణతో ఏపీకి నీటి పంపకాల్లో.. ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణా జలాలకు సంబంధించి కొత్త డిమాండ్లను తెర మీదకు తెచ్చారు. కృష్ణా జలాల్లో తమకు సగం వాటా కావాల్సిందేనని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపింది. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణకు చెందిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తాజాగా టీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తప్పంతా కేసీఆర్ దేనని కూడా వారు తేల్చేశారు. కృష్ణా జలాలపై గతంలో ఏపీతో కుదిరిన ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని కూడా వారిద్దరూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదీ 2015 నాటి ఒప్పందం..
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2015లో కేంద్రం మధ్యవర్తిత్వంతో సమావేశమైన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు నీటి కేటాయింపులపై సంతకాలు చేశారు. నాటి ఒప్పందం ప్రకారం కృష్ణా నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలను కేటాయించాల్సి ఉంది. ఈ ఒప్పందంపై నాడు ఇరు రాష్ట్రాలు సంతకాలు చేశాయి. ఆ మేరకే ఇప్పటికీ నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాలు ఈ కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో జగన్ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టగా.. కేసీఆర్ ఈ ఒప్పందానికి కట్టుబడేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాల్లో తమకు 50 శాతం వాటా కావాల్సిందేనని కేసీఆర్ కొత్తగా డిమాండ్ చేశారు.
ఇంత లేటు స్పందనా?
కేసీఆర్ వ్యాఖ్యలు తప్పంటూ స్వయంగా తెలంగాణకు చెందిన రెండు కీలక పార్టీల అధ్యక్షులే చెప్పేశారు. ఇవే లెక్కలను చూపిస్తూ వారు కేసీఆర్ తీరును ఎండగట్టారు. అంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న కొత్త డిమాండ్లు సరికాదని ఆ ప్రాంతానికి చెందిన నేతలే చెప్పేసిన తర్వాత… చాలా ఆలస్యంగా జగన్ ఈ విషయాలను ప్రస్తావించడంపై సెటైర్లు పడుతున్నాయి. గురువారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్.. అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాటి కృష్ణా జలాల ఒప్పందాన్ని గుర్తు చేశారు. ఆ లెక్కలతో పాటు అసలు శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల మేర నీటి నిల్వలు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీరు వస్తుందని, గడచిన 20 ఏళ్లలో 20 సార్లు కూడా శ్రీశైలం పూర్తి నిల్వ సామర్థ్యం మేర 885 అడుగులు చేరనే లేదని తేల్చేశారు. అంటే.. నీటి లభ్యత ఉంటుందో, లేదో కూడా తెలియకుండానే.. వాన దేవుడిపై భారం వేసి రాయలసీమ ప్రాజెక్టును కడుతున్నట్లుగా చెప్పేశారు. మొత్తంగా తెలంగాణ సీఎం వ్యాఖ్యలను తెలంగాణ నేతలు ఖండించిన తర్వాత జగన్ మాట్లాడటంపై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.
Must Read ;- జగన్ భయపడ్డారు!.. ఇదిగో ‘సాక్షి’!











