(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విసిరిన సవాల్తో విశాఖలో అగ్గి రాజుకుంది. ఆయన ఛాలెంజ్కు స్పందించే ధైర్యం లేకనో ఏమో..! ఎంపీ విజయసాయిరెడ్డి పెద్దగా స్పందించకపోయినా, ఆయన మెప్పుకోసం అనుచర వర్గం మాత్రం కిందా మీదా పడుతోంది. వెలగపూడి నేరుగా ఎంపీ విజయ సాయిరెడ్డికి సవాలు విసిరితే, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు స్పందించడం విడ్డూరం. శుక్రవారం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ప్రెస్ మీట్ పెట్టి వెలగపూడిపై తనకున్న విజ్ఞానాన్ని అంతా ప్రదర్శించారు. బినామీ ఆస్తులు తనవి కావని వెలగపూడి నేరుగా చెప్పలేకపోయారని చెప్పుకొచ్చారు. వాస్తవానికి బినామీ పేర్లకు తనకు సంబంధం లేదని వెలగపూడి గురువారమే స్పష్టం చేశారు. ఆ విషయం కూడా తెలుసుకోకుండా అమర్ నాథ్, ఎంపీ చల్లని చూపు కోసం తహతహలాడారు. పైగా ఈ వివాదంలోకి మరో దేవుడిని కూడా లాగారు. తనకు ఆరాధ్యదైవమైన షిరిడి సాయి మీద ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి డిమాండ్ చేస్తే, అలా కాదు సింహాద్రి అప్పన్న మీద ఒట్టు వేయాలని ఎమ్మెల్యే అమర్ డిమాండ్ చేశారు.
అక్కరమాని.. హడావుడి..
ఇదిలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను, నియోజకవర్గ ముఖ్య నాయకులను ఉదయం 10 గంటలకు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా దేవాలయం వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ సంఖ్యలో తరలిరావాలని విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పిలుపునిచ్చారు. విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు తన స్థాయిని మరచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పైన సత్య ప్రమాణానికి పిలుపునిచ్చారనీ, దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Must Read ;- వెలగపూడి సవాల్ను విజయసాయిరెడ్డి స్వీకరిస్తారా..?
ఈ మేరకు 10 గంటల ప్రాంతంలో సాయిబాబా దేవాలయం వద్ద అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పిలుపునివ్వడంతో శనివారం ఉదయం పదకొండున్నర గంటల వరకు వెలగపూడి కోసం ఎదురుచూసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడ నుంచి వెలగపూడి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.
వెలగపూడి కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు చేరుకోవడంతో వివాదాలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వెలగపూడి దేవుడిపై ఓటు వేసేందుకు భయపడి రాలేదని, ఆయన బినామీల పేరిట ఆస్తులు ఉన్నాయని అంగీకరించినట్లేనని విజయ నిర్మల పేర్కొన్నారు. మరోవైపు వెలగపూడి అనుచరులు బినామీ ఆస్తుల నిగ్గు తేల్చాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నినాదాలు చేశారు.
ఒకరి సవాల్ కు మరొకరి స్పందన..
వెలగపూడి రామకృష్ణబాబు పై ఆరోపణలు చేసింది ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయనకు సవాల్ విసిరింది ఎమ్మెల్యే రామకృష్ణ బాబు. వీరిద్దరి కన్నా క్రింది స్థాయి నాయకుల హడావుడి విశాఖలో ఎక్కువైంది. ఎంపీని విమర్శించే స్థాయి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తికి లేనప్పుడు… ఆయన్ను విమర్శించే స్థాయి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్నికల్లో ఒకసారి గెలవని వారికి ఎలా వచ్చిందో ఆ పార్టీ నేతలే సెలవివ్వాలి.
Also Read ;- విశాఖ టీడీపీ నేతలకు రెవెన్యూ అధికారుల షాక్.. భూముల స్వాధీనం