(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో వారం వారం టిడిపి నేతల ఆస్తుల పై జరుగుతున్న దాడులు భవిష్యత్తులోనూ కొనసాగుతాయా? ఇప్పటివరకు స్వాధీన ప్రక్రియతో ఆగుతున్న అధికారులు భవిష్యత్తులో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారా? టిడిపి నేతలను కటకటాల పాలు చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ అడుగులు వేస్తోందా? స్టేషన్ బెయిల్ దొరకని సెక్షన్లతో ఇరికించే ప్రయత్నం జరగబోతోందా? అంటే అవుననే సంకేతాలే ఇస్తున్నారు పార్లమెంటు సభ్యులు వి.విజయసాయిరెడ్డి.
విశాఖలో వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టారు. టీడీపీ హయాంలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చివరకు దేవాదాయ శాఖకు చెందిన భూముల రికార్డులను తారుమారు చేశారని, అందులో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని ప్రతి ఒక్కరి పైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు., తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించకుంటే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ భూమిలోనే సెక్రటరియేట్..
విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఒక్క సెంటు ప్రైవేట్ భూమి కూడా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సేకరించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలంలోనే సెక్రటేరియేట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గత పదేళ్లుగా భూబకాసురులు తెలుగుదేశం నేతలు ప్రభుత్వ భూములను కాజేశారని, వాటిని కక్కించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కోర్టులో ఉన్న భూములను వదలం..
స్వాధీన ప్రక్రియను కోర్టుల ద్వారా అడ్డుకున్న నేతలను విడిచి పెట్టబోమని ఎంపీ హెచ్చరించారు. రేపో మాపో కోర్టులో స్టే వెకేట్ చేయించి, భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇక ఎన్నో రోజులు వారి ఆటలు సాగవని అన్నారు. అవసరమైతే అరెస్టులకు వెనుకాడబోమని తెలిపారు.
ఐపీసీ సెక్షన్ల ఎక్స్పీరియన్స్..
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే… ఎంపీ విజయసాయి రెడ్డి కి సిబిఐ, కోర్టుల చుట్టూ తిరిగి.. ఐపీసీ సెక్షన్ ల పై ఎనలేని అవగాహన పెరిగింది. క్రిమినల్ కేసులు పెట్టినా.. స్టేషన్ బెయిల్ పై బయటికి రావచ్చని టీడీపీ నేతలు భావించవద్దని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడతాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. ఏ సెక్షన్లకు స్టేషన్ బెయిలు వస్తుంది.. ఏ సెక్షన్లకు ఏడేళ్లు, 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది.. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే టీడీపీ నేతల ఆట కట్టించవచ్చునో ఒక న్యాయవాది కన్నా విపులంగా వివరించారు. ఏడు ఏళ్ళు పైబడిన శిక్షలుపడే అవకాశం ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ రాదని స్పష్టం చేశారు. అటువంటి సెక్షన్ లే రాబోయే రోజుల్లో నమోదు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. Ipc 466, 467, 418, 468, 465, 204, 409, 491 లాంటి అనేక సెక్షన్లు ఉన్నాయని టక టకా చెప్పేశారు. ఎంతైనా ఎంపీ గారి అనుభవం అటువంటిది మరి. మొత్తంగా విశాఖలో రానున్న రోజుల్లో టీడీపీ నేతలపై మరిన్ని దాడులు తప్పవని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.
Must Read ;- అర్రెర్రే.. కూల్చివేతల దూకుడులో ఝలక్ బొత్సకే పడ్డదే!