తెలంగాణలో రాజకీయ పార్టీలకు అర్జంటుగా రాష్ట్ర ప్రయోజనాలు గుర్తొచ్చేశాయ్. ఎప్పుడో వాళ్లు మర్చిపోకపోయినా.. మర్చిపోయినట్లు నటించి.. జనం మర్చిపోయేలా చేసిన ప్రాజెక్టుల పేర్లు మళ్లీ ఇప్పుడు మోత మోగిస్తున్నారు. నువ్వు తెచ్చుకోలేదని బీజేపీ అంటే.. నువ్వు ఇవ్వలేదని టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మెమరీ తిరిగొచ్చిన పేషెంట్లలా నేతలంతా ప్రవర్తిస్తున్నారు. ఐటీఐర్ ప్రాజెక్ట్ ఎప్పుడో కేంద్రం కాన్సెప్టే కేన్సిల్ అని చెప్పేసినా.. మరెందుకో బండి సంజయ్ దాన్ని పట్టుకుని ఛాలెంజ్ విసిరారు. మీరు సరిగా రిపోర్టు ఇవ్వలేదంటూ అన్ని ప్రాజెక్టులతో కలిపేసి మాట్లాడారు. దీంతో కేటీఆర్ ఆ విషయాన్ని గట్టిగా పట్టుకుని.. బీజేపీవాళ్లను వాయించేశారు. దీంతో బీజేపీవాళ్లు ఢిఫెన్స్లో పడ్డారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు లేదనడంతో..
పుండు మీద కారంలా.. సరిగ్గా ఈ టైమ్లోనే ఎవరో సమాచార హక్కు చట్టం ద్వారా అప్లయ్ చేస్తే.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు లేదని తేల్చేస్తూ కేంద్రం చెప్పేసింది. ఇంకేముంది అది కూడా టీఆర్ఎస్ వాళ్లు అందుకున్నారు. పైగా రైల్వేను ప్రయివేటీకరించడం.. ఎల్ఐసీని ప్రయివేటీకరించడం.. విశాఖ ఉక్కును ప్రైవేటుకిచ్చేలా ప్రాసెస్ చేయడం.. మరోవైపు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పెడతామని ఎప్పుడో చెప్పి.. ఇప్పటికీ పట్టించుకోకపోవడం.. అన్నీ కలిపి ఒక్కసారే కమలనాథులపై కసితీరా గులాబీ సైన్యం దాడి చేస్తోంది.
ఇంతకు ముందే టీఆర్ఎస్కు తెలిసినా..
అయితే అసలు విషయం ఏంటంటే.. ఇవన్నీ ఆగిపోయాయని ఇంతకు ముందే టీఆర్ఎస్కు తెలుసు. అయినా వాటి గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు.. గొడవ చేసింది లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఇప్పుడన్నిటిని తీసి.. బీజేపీపై ఎదురు దాడి చేస్తున్నారు. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రధాని మోదీనే టార్గెట్ చేశారు. ఆత్మనిర్బర్ లాంటి నినాదాలే తప్ప.. విధానాలేమీ లేవని డైరెక్ట్ అటాక్ చేశారు. ఆరేళ్లలో తెలంగాణకు ఇది ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా బీజేపీ దగ్గర ఏమీ లేదని తేల్చేశారు.
ఇరకాటంలో బీజేపీ..
కేంద్రంలో బీజేపీ తమ పాలసీలపై ముక్కుసూటిగా, మొహమాటం లేకుండా మోదీ ద్వారానే చెప్పేస్తోంది. కాని అది బలంగా లేని చోట.. వాటిపై వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారు కమలనాథులు. ఏదో పైకి మొండిగా వాదించినా.. పరిస్ధితి అలాగే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల టైములో బీజేపీ మాత్రం ఇరకాటంలోనే పడిందని చెప్పాలి. అటు ఏపీలోనూ విశాఖ ఉక్కు వ్యవహారంతో అలాగే తయారైంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఢిల్లీ స్థాయిలో ఎంత అండర్ స్టాండింగ్ ఉన్నా.. ఇక్కడ ఒకరికొకరు పోటీ పడి సవాళ్లు విసురుకుంటూ కాంగ్రెస్ను వెనక్కు నెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ వెనక్కు పోతుందా..వీరిద్దరే వెనక్కు పోతారా అనేది వేచి చూడాలి.
Must Read ;- టీఆర్ఎస్ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ.. తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు