గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అంబటిపై అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రాజుపాలెం మండలం కొండమోడులో ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాడంటూ సొంత పార్టీ నేతలే హైకోర్టులో కేసువేసిన ఘటన మరవక ముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అంబటి అనుచరుడు సత్తెనపల్లి మార్కెట్ యార్డు ఛైర్మన్ రావిపాటి పురుషోత్తం రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు ప్రారంభించారు. ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేశారు. దీంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలే అడ్డుకోవడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. మార్కెట్ యార్డు ఛైర్మన్ తన డ్రైవర్ ను కొట్టారంటూ అడ్డుకున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. నలుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు. సొంతపార్టీ నేతలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడంతో అంబటిపై వారు రగిలిపోతున్నారు. అట్రాసిటీ కేసులతో గొడవ మరింత తీవ్రమైంది.
అంబటికి అడ్డం తిరిగిన రెడ్లు
సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో రెడ్ల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అక్కడ వైసీపీకి ఓట్లు పడాలంటే వారి మద్దతు తప్పనిసరి. గత ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ సీటు ఆశించిన చాలా మంది పెద్దారెడ్లు ఇప్పుడు అంబటికి కొరకరానికి కొయ్యగా తయారయ్యారు. ఎలాగైనా సత్తెనపల్లి నుంచి అంబటిని పంపిస్తే సీటు తమ సామాజిక వర్గానికే దక్కుతుందని ముగ్గురు రెడ్లు తీర్మానించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఏ విషయంలోనూ అంబటిని వదిలిపెట్టడం లేదు.
కొండమోడు అక్రమ మైనింగ్ పై అంబటిపై హైకోర్టులో కేసులో వేయించడంలోనూ పెద్దారెడ్లు కీలకంగా వ్యవహరించారు. తాజాగా వారి కులస్థులపైనే అట్రాసిటీ కేసులు పెట్టడంతో ఇక సత్తెనపల్లిలో రెడ్లు, వర్సెస్ అంబటి అన్న విధంగా తయారైంది. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గం అంబటి తమ్ముడు మురళికి అప్పగించి, ఎమ్మెల్యే గుంటూరుకే పరిమితం అవుతున్నారు. ఎప్పుడో నెలకోసారి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి కాలుపెడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అంబటి రాంబాబు మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సి వస్తుంనదే సంకేతాలు వెలువడుతున్నాయి.
మా ఓట్లతో గెలిచి మాపై కేసులా…
తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం మట్టి తవ్వకాల్లో నెలకొన్న వివాదాలు అట్రాసిటీ కేసులు పెట్టుకునే దాకా వచ్చాయి. అంబటి ప్రోత్సాహంతోనే సత్తెనపల్లి మార్కెట్ యార్డు ఛైర్మన్ తమపై అట్రాసిటీ కేసులు పెట్టి బెయిల్ లేకుండా చేశారని రెడ్లు రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు అంబటికి కొత్త సమస్య వచ్చి పడింది. ఎర్రమట్టి అక్రమతవ్వకాలు కేసు ఎత్తి వేయిస్తే ఓ వర్గం నేతలు, కేసు కొనసాగిస్తే రెడ్ల సామాజికవర్గం దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అంబటి అడ్డంగా ఇరుక్కుపోయారు. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా సత్తెనపల్లి వైసీపీ నేతల వ్యవహారం తయారైంది.
అంబటికి ఘోర అవమానం
టిడ్కో ఇళ్లు ప్రారంభించేందుకు సత్తెనపల్లిలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యే బాగా హడావుడి చేశారు. సత్తెనపల్లిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 4500 గృహాలు ప్రారంభించే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే కూడా పరిశీలించారు. అయితే తమకు రావాల్సిన బిల్లులు చెల్లించి, టిడ్కో ఇళ్లలో అడుగు పెట్టాలని ఆ ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో అంబటికి ఏమి చేయాలో అర్థం కాక అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. అంబటి చెబితే టిడ్కో బిల్లులు మంజూరు అయ్యే పరిస్థితిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.9000 కోట్లు టిడ్కో ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకుండా గృహప్రవేశాలు ఎలా చేస్తారని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అంబటి విస్తుపోయారు. సత్తెనపల్లిలో టిడ్కో గృహ లబ్దిదారులకు పొజిషన్ సర్టిపికెట్ ఇచ్చినా వారు ఇంటిలోకి అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అంబటికి సత్తెనపల్లిలో మరోషాక్ తగిలినట్టయింది.
Must Read ;- సత్తెనపల్లి టీడీపీలో మూడు ముక్కలాట.. సందిగ్ధంలో అధిష్టానం











