మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ పరిధిలో ఓ యాభై ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్న రియల్టర్ను బెదిరించినట్టు ఓ ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియో టేపులో.. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘కేవలం సర్పంచ్ ని కలిస్తే సరిపోతుందా.. ఎమ్మెల్యే, మంత్రి ఉంటారుగా..వెంటనే తీసుకురా..వచ్చి కలువు’ అని అవతలి వ్యక్తిని హెచ్చరించినట్లుగా ఉంది. ఈ ఆడియోలోనే..తనను కలిసే వరకు పనులు నిలిపివేస్తానని బెదిరించినట్టు కూడా ఉంది. అయితే ఈ ఆడియో నిజమైందా కాదా.. మల్లారెడ్డి మాట్లాడిన మాట అదేనా..లేకుంటే ట్యాంపరింగ్ ఆడియోనా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది.
Another Allegation on Minister Mallareddy :
ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో..
కాగా మల్లారెడ్డిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో..ఆ ఆడియోపైనా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రధాని కావాలని దేశప్రజలు చాలా మంది కోరుకుంటున్నారని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. గతంలోనూ మల్లారెడ్డిపై పలు వివాదాలు ఉన్నాయి. బోడుప్పల్ పరిధిలో పురపాలక ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేసినట్టు ఓ ఆడియో బయటకు వచ్చింది. ఆయన మాట్లాడినట్లుగా ఆ ఆడియోలో ఉంది. మరో మున్సిపాల్టీ పరిధిలోనూ దాదాపు రూ.25లక్షలు డిమాండ్ చేసినట్టు ఆడియో విడుదలైంది. ఇక రెండు నెలల క్రితం మల్లారెడ్డిపై, ఆయన కుమారుడిపై భూ ఆక్రమణ కేసు కూడా నమోదైంది. సూరారంలో సర్వే నెంబర్ 115,116,117 లో 20 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డి, కొడుకు భద్రారెడ్డి మరో ఐదుగురు కబ్జా చేశారంటూ శ్యామలదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులోనే తనను బెదిరింపులకు గురిచేశారన్న ప్రచారమూ జరిగింది. తన లాయర్ని డబ్బులిచ్చి వాళ్లవైపు తిప్పుకున్నారని సదరు మహిళ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

టీఆర్ఎస్ పార్టీపైనా..
ఈ క్రమంలో వైరి పక్షాలు మల్లారెడ్డితో పాటు టీఆర్ఎస్ పార్టీపైనా పలు ఆరోపణలు చేశాయి. కాగా దీనిపై అప్పట్లో మల్లారెడ్డి స్పందిస్తూ ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీంటోపాటు గతంలో ఓ హోటల్లో రేవ్ పార్టీ వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డి సంబంధీకులు ఉన్నారని, పోలీసుల తనిఖీల్లో వారు పట్టుబడగా పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి విడిపించుకెళ్లారని ప్రచారం జరిగింది. ఇదే కాకుండా 2019లో ఓ స్థల వివాదంలో దాడి ఘటనలోనూ మంత్రి మల్లారెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. పెట్రోల్ దాడి జరగడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనతోనూ తనకు సంబంధం లేదని మల్లారెడ్డి అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనుల కోసం చాలామంది కార్యకర్తలు, నాయకులు తమ వద్దకు వస్తుంటారని వారిలో ఎవరు నిందితులో తనకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఆ కేసుల్లో మంత్రి మల్లారెడ్డికి డైరెక్ట్ సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన బెడితే.. తాజాగా విడుదలైన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ వీడియోను నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో వాడుకోవడం మొదలు పెట్టింది. టీఆర్ఎస్లో కబ్జాదారులే ఎక్కువ ఉన్నారని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Must Read ;- సాగర్లో పార్టీల వ్యూహప్రతివ్యూహాలు.. ఎవరికి వారే గెలుపు అంచనాలు











